Hyderabad: దారుణం.. ఈ మధ్య కాలంలో వయసుతో సంబందధం లేకుండా గంజాయికి అలవాటు పడుతున్నారు.. దీని మత్తులో వాళ్లు ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియడం లేదు.. దీంతో అనవసరంగా ఏ సంబంధం లేని మరెందరో చనిపోతున్నారు. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో కొందరు మైనర్లు సామాన్యులపై దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా రద్దీగా ఉండే డీమార్ట్ పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఐదుగురు మైనర్ యువకులు గంజాయి సేవించి, అటుగా వెళ్తున్న ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో యువకులు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పట్ల మహిళలు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న రాత్రి డీమార్ట్కు వెళ్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మైనర్ల ముఠా గొడవకు దిగింది. మత్తులో ఉన్న యువకులు అకారణంగా రాకపోకలు సాగించే వారిపై దాడులకు పాల్పడటంతో సహనం కోల్పోయిన స్థానికులు ఏకమై వారిని అడ్డుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ ఐదుగురు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులకు నిందితులను అప్పగించి, ఈ ప్రాంతంలో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
గంధంగూడ డీమార్ట్ పరిసరాలు క్రమంగా గంజాయి ముఠాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో నిర్మానుష్య ప్రాంతాలు, చీకటిగా ఉండే సందుల్లో ఈ యువకులు గుంపులు గుంపులుగా చేరుతూ మత్తు పదార్థాలను సేవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మైనర్ యువకులు పెడదోవ పట్టి ప్రాణాంతకమైన గంజాయి అలవాటుకు బానిసలవ్వడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయం. కేవలం సరదా కోసం మొదలుపెట్టి, మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో దాడులకు తెగబడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచడమే కాకుండా, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి!
ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన మైనర్లకు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? దీని వెనుక ఉన్న ముఠాలెవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో పెరుగుతున్న ఈ గంజాయి కల్చర్ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.