Mumbai Crime: వ్యసనాలకు బానిసైతే ఎలాంటివాడైతే రోడ్డున పడాల్సిందే. అందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టినా జల్సాలకు అలవాటు పడితే మటాష్. అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆన్లైన్లో జూదానికి అలవాటు పడి అప్పులపాలై దొంగగా మారాడు. పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలో దొంగగా మారిన వ్యాపారవేత్త
ముంబైలోని సియాన్ ప్రాంతానికి చెందినవాడు మోహన్ కొకాటే. అతడ వయస్సు దాదాపు 49 ఏళ్లు. సంపన్నుల కుటుంబంలో జన్మించిన మోహన్, కొన్నాళ్ల కిందట వరకు గార్డెనింగ్ వ్యాపారం చేసేవాడు. ఆయన ఫ్యామిలీలో అందరూ ఉన్నత విద్యావంతులేకాదు పెద్ద హోదాలో ఉన్నారు. అతని సోదరి దుబాయ్లో ఉంటోంది. సోదరుడు అమెరికాలో ఉంటున్నాడు.
ఒక కొడుకు చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, మరొకరు ఇంజనీర్. ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మోహన్ ఆన్లైన్ క్యాసినో, జూదానికి కనెక్ట్ అయ్యాడు మోహన్. దాని కోసం విపరీతంగా అప్పులు చేశాడు.. జూదం ఏమోగానీ చేసిన అప్పులు పెద్ద కుప్పగా మారింది. వాటిని తీర్చేందుకు చివరకు దొంగ అవతారం ఎత్తాడు.
జూదానికి అడిక్ట్.. అప్పులు తీర్చేందుకు దొంగతనాలు
ఇటీవల కాలంలో మార్కెట్లో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో ముంబైలో దొంగతనాలు జోరందుకున్నాయి. బైక్పై ప్రయాణిస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ ఘటన వెనుక మోహన్ ఉండేవాడు. దీంతో పోలీసులు దొంగతనాలు చేసేవారిపై ఓ కన్నేశారు.
ముఖానికి హెల్మెట్ ధరించడం, ఎప్పటి కప్పుడు దుస్తులు మార్చడంతో మోహన్ని గుర్తించడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లో దాదాపు 80 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దొంగతనం చేసిన ప్రతిచోటా దొంగ వేర్వేరు దుస్తుల్లో కనిపించడంతో సవాల్గా మారింది. అన్నిచోట్లా ఒకే రకమైన షూ ధరించడంతో దాని ఆధారంగా ఫోకస్ చేశారు పోలీసులు.
ALSO READ: విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు.. ఎస్పీ సందీప్ రావు కీలక నిజాలు వెల్లడి
దొంగిలించిన బైక్ ను అమ్మే ప్రయత్నంలో మోహన్ని చాకచక్యంగా పోలీసులు అరెస్టు చేశారు. ఇక మోహన్ 2011లో ఒకసారి జైలుకి వెళ్లాడు. విడుదలైన తర్వాత నేరాలకు దూరంగా ఉన్నాడు. ఆన్లైన్ గేమింగ్లో నష్టాలు రావడంతో నేర కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టాడు.
జనవరి నెలలో మోహన్పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ముంబైలో అతడిపై దాదాపు 20కి పైగా కేసులున్నాయి. కోకాటే తన గుర్తింపును దాచిపెట్టి నవీ ముంబైలో వివిధ ప్రాంతాలలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో పలుమార్లు ఫ్యామిలీ సభ్యులు మోహన్కి వార్నింగ్ ఇచ్చాయి. అయినా అతడి బుద్ది ఏ మాత్రం మారలేదు.