Cyber scam: చూస్తుంటే ఎంత ముద్దుగున్నారు.. ఇంత మంచివాళ్లా అనేలా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం అంతా మాయాజాలం. ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్తో మొదలైన అనుబంధం చివరికి కోట్ల రూపాయలు గాలిలో కలిసిపోయేలా చేస్తుందంటే నమ్మగలరా? అసలు విషయం బయటపడేలోపు, బాధితుడి జీవితం, ఆరోగ్యం, సంపద అన్నీ తలకిందులయ్యాయి.
ముంబై నగరంలో 80 ఏళ్ల వృద్ధుడి జీవితం, ఒక సైబర్ మోసం కారణంగా పూర్తిగా మారిపోయింది. ఫేస్బుక్లో 2023 ఏప్రిల్లో ‘శర్వి’ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె తన భర్తతో విడిపోయానని, పిల్లల వైద్య చికిత్స కోసం డబ్బు కావాలని చెప్పింది. మంచితనం నమ్మిన వృద్ధుడు, తన పొదుపుల నుంచి డబ్బు పంపడం మొదలుపెట్టారు.
ఇంతలోనే మరో ముగ్గురు మహిళలు కవిత, దినాజ్, జాస్మిన్ లు వాట్సాప్లో అతనిని సంప్రదించారు. ఒక్కొక్కరు వేర్వేరు సమస్యలు చెబుతూ సహాయం కోరారు. పరిస్థితి మరింత విషమించింది, దినాజ్ ‘శర్వి’ చనిపోయిందని, ఆసుపత్రి బిల్లులు చెల్లించాలంటూ డబ్బు డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
2 సంవత్సరాల కాలంలో మొత్తం 734 ఆన్లైన్ లావాదేవీలు జరిగాయి. మొత్తం సొమ్ము అక్షరాలా రూ. 8.7 కోట్లు! ఈ మొత్తం ఇచ్చాక కూడా వృద్ధుడు ఆగకుండా, తన కుమారుడు, కోడలి వద్ద అప్పు తీసుకొని డబ్బు పంపాడు. చివరికి కుమారుడికి అనుమానం వచ్చి, లావాదేవీలను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.
ఈ నిజం విన్న వృద్ధుడు తీవ్ర షాక్కు గురై ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. జూలై 22న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు పేర్లతో ఒకే మహిళ మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో, లక్నోలో మరో సైబర్ మోసం బహిర్గతమైంది. బ్యాంక్ అధికారులమని చెప్పి, మీ క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోంది, రెన్యువల్ చేయాలి అంటూ కాల్స్ చేసి, కార్డు వివరాలు దోచుకున్న బోగస్ కాల్ సెంటర్ను పోలీసులు గుర్తించారు.
Also Read: King cobra sanctuary: ఏపీకి సర్ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!
సరోజిని నగర్ పోలీస్ స్టేషన్లో స్థానిక వ్యక్తి జితేంద్ర కుమార్ ఫిర్యాదు చేయడంతో, సైబర్ క్రైమ్ టీమ్, పోలీసులు కలసి, ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో ఉన్న ఆ కాల్ సెంటర్ను గుర్తించి దాడి చేశారు. అక్కడి నుంచి వికాస్ కుమార్ (28), రాహుల్ లక్షేరా (31) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వీరు ఒక సంవత్సరంలోనే రూ. 50 లక్షల మోసం చేశారు. ఇంటినే కాల్ సెంటర్గా మార్చుకొని, మహిళలకు నెల జీతం రూ. 10,000 నుండి రూ. 15,000 ఇచ్చి ఉద్యోగం పెట్టారు. బాధితుల డేటాను దుబే జీ అనే వ్యక్తి బీహార్ నుంచి సరఫరా చేసేవాడు. ఒక్కో కస్టమర్ వివరానికి రూ. 10 తీసుకునేవాడు. పోలీసులు 25 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులు, ల్యాప్టాప్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై, లక్నో ఘటనలు ఒక్కటే చెబుతున్నాయి – నేటి సైబర్ నేరాలు కేవలం డబ్బు దోపిడీ కాదు, మనసుని, ఆరోగ్యాన్నీ నాశనం చేస్తాయి. పరిచయం లేని వ్యక్తులకు డబ్బు పంపేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి. బ్యాంక్ వివరాలు, కార్డు సమాచారం ఇవి మీ దగ్గరే ఉండాలి, లేదంటే మోసగాళ్లు గాలిలో కలిపేస్తారు.