Drunk Driving: స్వేచ్ఛ బ్యూరో: జైలుశిక్షలు.. జరిమానాలు పడుతున్నా మేం మారేదే లేదంటున్నారు మందుబాబులు. ప్రతీ వారాంతంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతూ పట్టుకుంటున్నా దొరికినపుడు చూసుకుందాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పీకలదాకా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తూ దొరికిపోతున్నారు. ట్రై కమిషనరేట్లలో ఈ వారం జరిపిన టెస్టుల్లో ఏకంగా 1,046మంది మందు కొట్టి పట్టుబడ్డారు.
హైదరాబాద్ కమిషనరేట్లో..
రోడ్డు భద్రతలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు వేర్వేరు చోట్ల శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు జరిపారు. దీంట్లో 445మంది దొరికారు. పట్టుబడిన వారిలో 371మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఇక, ఆటోలు నడుపుతూ 26మంది, కార్లు డ్రైవ్ చేస్తూ 48మంది దొరికారు. అందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నారు.
Also read: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే నెలలో ముఖ్య తేదీలివే
మల్కాజిగిరి కమిషనరేట్ లో జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో 318మంది పట్టుబడ్డారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు 271మంది ఉన్నారు. ఆటోలు నడుపుతూ 10మంది, కార్లు డ్రైవ్ చేస్తూ 37మంది దొరికారు. గత వారం పట్టుబడిన వారిలో 17మందికి కోర్టులు జైలు శిక్షతోపాటు జరిమానా విధించాయి. మరో 18మందికి జరిమానా విధించి సామాజిక సేవ చేయాలని ఆదేశించాయి.
ఇక, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిపిన పరీక్షల్లో 283మంది మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ దొరికారు. వీరిలో 227మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఆటోలు నడుపుతూ 9మంది, కార్లు డ్రైవ్ చేస్తూ 39మంది పట్టుబడ్డారు. ఇక, భారీ వాహనాలు నడుపుతూ మరో 8మంది దొరికారు. అందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఆయా కోర్టుల్లో హాజరుపరచనున్నారు.
Also read: బచ్చన్నపేటలో వరుస విషాదాలు.. ఈత సరదాకు మరో ప్రాణం బలి!