Drowning Deaths: స్వేచ్ఛ బ్యూరో: బచ్చన్నపేట మండలంలో 48 గంటల వ్యవధిలో రెండు నీటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈత సరదా మరో ప్రాణాన్ని బలిగొంది. మండల కేంద్రంలో ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు రాజన్న బావిలో మునిగి గల్లంతై, మరుసటి రోజు ఉదయం మృతదేహం లభించిన విషయం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది.
రామచంద్రపురం గ్రామానికి చెందిన చీర కరుణాకర్ అనే వికలాంగుడు ఈత కొట్టే క్రమంలో అకస్మాత్తుగా తుమ్మల బావి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఎంతకూ పైకి రాకపోవడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం వరకు మృతదేహం లభ్యం కాలేదు. ఘటనపై గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే నెలలో ముఖ్య తేదీలివే
వరుస ప్రమాదాల నేపథ్యంలో బచ్చన్నపేట మండల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. బావులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని, లోతు తెలియని చోట ఈత, డైవింగ్ వంటి సాహసాలు ప్రాణాంతకమని హెచ్చరించారు. రెండు రోజుల్లో రెండు ప్రాణాలు కోల్పోవడంతో బచ్చన్నపేట మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read; తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!