పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి, ఆపై మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్తున్న భర్తను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఇటీవల వెంకటేష్ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలో మహాలక్ష్మిని మాట్లాడుదామని, ఆమె తాలూక బంగారం ఇస్తానని చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్ళాడు వెంకటేష్. అక్కడ ఇద్దరి మధ్య మాటల తూటాలు తలెత్తగా.. తీవ్ర ఆగ్రహంతో వెంకటేష్ స్వెటర్ లేస్తో మహాలక్ష్మి గొంతు బిగించి అతి కిరాతకంగా హత్య చేశాడు.
హత్య అనంతరం, మహాలక్ష్మి మృతదేహాన్ని బైక్పై తరలిస్తున్న సమయంలో, అనుమానాస్పదంగా కనిపించిన వెంకటేష్ను పోలీసులు గమనించి ఆపారు. విచారణలో నేరం వెలుగుచూసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటనా తీవ్ర కలకలం రేపింది. మహిళలపై జరిగే హింసపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.