Sarpanch Elections: మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తి పరిణామం చోటుచేసుకుంది. మెదక్ మండల పరిధిలోని చీపురుదుబ్బ తండా పంచాయతీ ఎన్నికల ఫలితం ఉత్కంఠకు తెరదించింది. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడానికి అధికారులు చివరకు ‘డ్రా’ పద్ధతిని ఆశ్రయించాల్సి వచ్చింది. అదృష్టం వరించడంతో కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీత సర్పంచ్గా ఎన్నికయ్యారు.
చీపురుదుబ్బ తండాలో మొత్తం 377 ఓట్లు ఉండగా.. అందులో 367 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ప్రత్యర్థులైన కేతావత్ సునీత (కాంగ్రెస్ మద్దతుదారు), బీమిలి (బీఆర్ఎస్ మద్దతుదారు) మధ్య హోరాహోరీ పోరు సాగింది. తుది ఫలితాల సమయానికి ఇద్దరు అభ్యర్థులకు సరిగ్గా 182 ఓట్ల చొప్పున సమానంగా రావడంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. పోలైన ఓట్లలో రెండు ఓట్లు చెల్లనివి (ఇన్వాలిడ్) కాగా, ఒక ఓటు నోటా (NOTA)కు పడింది.
ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో.. నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి వెంకటయ్య లాటరీ (డ్రా) తీయాలని నిర్ణయించారు. ఇద్దరు అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా చీటీలు వేయగా.. అదృష్టం కేతావత్ సునీతను వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
కేతావత్ సునీత విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, ఆమె అనుచరులు తండాలో సంబరాలు జరుపుకున్నారు. కేవలం ఒక్క చీటీ రూపంలో అదృష్టం కలిసిరావడంతో సునీత విజయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధిలో తండాను ముందుంచుతానని ఈ సందర్భంగా సునీత స్పష్టం చేశారు.
ALSO READ: Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్కు జీఐ ట్యాగ్