Australia Accident: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన BMW కారు ఢీకొని 8 నెలల భారత సంతతికి చెందిన గర్భిణీ మృతి చెందింది. శుక్రవారం రాత్రి సిడ్నీలోని హార్న్స్బై శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ మృతి చెందింది. సమన్విత ధరేశ్వర్ అనే మహిళ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి కారులో వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన కారు ఆమెను తీవ్రంగా ఢీ కొట్టింది. ఆమె తన రెండో బిడ్డకు జన్మనివ్వడానికి కొన్ని వారాల ముందు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ధరేశ్వర్ ప్రయాణిస్తున్న కారు పార్కింగ్ గ్యారేజ్ వద్ద రోడ్డు దాటడానికి వేగాన్ని తగ్గించగా.. 19 ఏళ్ల ఆరోన్ నడుపుతున్నట్టు అనుభావిస్తున్న వేగంగా వస్తున్న BMW కారు వెనుక నుండి కియా కారును ఢీకొట్టింది. దీంతో కియా కారు ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను వెస్ట్మీడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందినట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. ఆమె అల్స్కో యూనిఫాంస్లో ఐటీ సిస్టమ్స్ విశ్లేషకురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
శనివారం ఉదయం టీనేజర్ డ్రైవర్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణానికి కోల్పోవడానికి కారణమైన నేరాలను నమోదు చేశారు. బెయిల్ విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్ రే ప్లిబెర్సెక్ ఈ ప్రమాదాన్ని చాలా విషాదకరంగా అభివర్ణించారు. ఆరోపణల తీవ్రత కారణంగా బెయిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ యువకుడు వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. జోయ్ చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు.
Also Read: Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..
2022లో న్యూ సౌత్ వేల్స్లో ప్రవేశపెట్టిన జోయ్ చట్టం పరిధిలోకి రావచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదకరమైన లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి పుట్టబోయే బిడ్డ మరణానికి కారణమైన నేరస్థులకు అదనంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి ఈ చట్టం చెబుతోంది.