క్రిప్టో కరెన్సీ ముసుగులో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మరో భారీ స్కామ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. ఈగల్ కాయిన్ పేరుతో కొందరు కేటుగాళ్లు గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపి, కోట్లాది రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేశారు. అధిక లాభాల ఆశచూపి మధ్యతరగతి ప్రజలను, ప్రముఖులను సైతం ఈ మాయాజాలంలోకి లాగారు.
సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఈ దందాలో కీలక పాత్ర పోషించారు. రూ. 2.25 లక్షలు పెట్టుబడి పెడితే, రోజుకు రూ. 1,000 చొప్పున ఆదాయం వస్తుందని నమ్మబలికారు. అంతేకాకుండా.. గొలుసుకట్టు విధానంలో మరికొందరిని చేర్పిస్తే అదనపు కమీషన్లు, విదేశీ పర్యటనలు ఉంటాయని ఆశ చూపారు. 18 నెలల కాలంలో రూ. 11 లక్షలు పెట్టుబడి పెడితే, ఏకంగా రూ. 30 లక్షలు వెనక్కి వస్తాయని మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మిన సుమారు 200 మంది బాధితులు దాదాపు రూ. 4.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు.
బయటపడ్డ అసలు రంగు..
పెట్టుబడి పెట్టిన కొద్దిరోజుల వరకు అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించినా, అసలు చెల్లింపుల సమయం వచ్చేసరికి నిర్వాహకుల అసలు స్వరూపం బయటపడింది. రాజేందర్ అనే వ్యక్తి రూ. 11 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టగా.. అతనికి కేవలం రూ. 1.20 లక్షలు మాత్రమే తిరిగి వచ్చాయి. మిగిలిన డబ్బు గురించి ప్రశ్నించగా నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల రంగప్రవేశం..
బాధితుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు సిరిసిల్లకు చెందిన లవన్ కుమార్, దోమల ప్రవీణ్, అడపు శ్రీధర్, వేణుగోపాల్, సుధాకర్, సుభాష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రిప్టో దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది బాధితులు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇలాంటి ఆశచూపే పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Rider Death: హెల్మెట్ పెట్టుకున్నాడు.. కానీ, చావు తప్పలేదు, కారణం ఈ తప్పే!