Mahesh Kumar Goud: ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ అంశాలపై హైకమాండ్తో చర్చిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పరిపాలన సాఫీగా సాగేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించడంలో తప్పేమీ లేదని, ఇది పాలనాపరమైన బాధ్యత అని ఆయన సమర్థించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శల వర్షం కురిపించారు. ఆ హయాంలో జరిగిన అవకతవకలు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో హరీష్ రావు, కేటీఆర్ కొంతమందికి ఎలా లబ్ధి చేకూర్చారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. “దొంగే దొంగతనం చేసి దొంగ అని అరిచినట్టు” బీఆర్ఎస్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కొన్ని సంస్థలకు బీఆర్ఎస్ నేతలు లబ్ధి చేకూర్చారని కవిత స్వయంగా చెప్పిన అంశాలను ఆయన గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారంపై స్పందిస్తూ, ఆమె తమ పార్టీకి అవసరం లేదని గతంలోనే చెప్పామని, ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నామని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మహేష్ కుమార్ గౌడ్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ను తాను వ్యక్తిగతంగా మరియు పార్టీ పరంగా ఒక హేయమైన నేరంగా పరిగణిస్తున్నానని చెప్పారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇవ్వాలని, పరిపూర్ణమైన ఎంక్వైరీ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. తమ ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే సమాచారాన్ని ఇప్పటికే అధికారులకు ఇచ్చామని పేర్కొన్నారు. చివరగా, కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని, రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
Read Also: Revanth Reddy: హార్వర్డ్ లో విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి.. మైనస్ 20 డిగ్రీల చలిలోనూ పాఠాలు..!