Ranga Reddy: స్వేచ్ఛ బ్యూరో: సొంత కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఒక కామాంధునికి కోర్టు 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (37) వృత్తిరీత్యా కూలీగా పనిచేస్తుండేవాడు. అయితే, మద్యంతో పాటు ఇతర దురలవాట్లకు బానిసైన అతడు, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే కన్నువేశాడు. వరుసగా ఆమెపై పలుమార్లు లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి వేధింపులను భరించలేకపోయిన బాధితురాలు, చివరకు తనకు వరుసకు సోదరుడయ్యే ఒక యువకుడికి తన ఆవేదనను తెలియజేసింది. దీంతో ఆ యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు షాబాద్ స్టేషన్ సీఐ కాంతారెడ్డి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పక్కా ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి కోర్టుకు చార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసును సమగ్రంగా విచారించిన న్యాయస్థానం అతనిని దోషిగా నిర్ధారించింది. నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 7,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆ బాలిక భవిష్యత్తు కోసం రూ. 7 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితునికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిక్షపతి గౌడ్, కానిస్టేబుల్ మహమ్మద్ అనీఫ్, హోం గార్డులు ప్రభాకర్, అలివేలును ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: నువ్వా మాట్లాడేది? పదో తరగతి పేపర్లు లీక్ చేసిన చరిత్ర నీది.. జగన్పై లోకేష్ ఫైర్