తెల్లారి లేస్తే చాలు పెట్రోల్ రేట్లు ఎంత పెంచారోననే బుగులు. రాత్రి అయ్యిందంటే చాలు.. రేపు పరిస్థితి ఏంటని తలుచుకోవడానికి భయం! అలాంటి దుస్థితిని తెచ్చిపెట్టింది కేంద్రం. వార్నింగ్ ఇచ్చే ఫైరింగ్ చేశాం కదా!అని చెప్పడానికి ఏకంగా బహిరంగ సభా వేదిక మీదే మోడీ పొదుపు మంత్రం జపించి వెళ్లిపోయాడు.ఇక రోజూ పెట్రో వాతలే. ఆగడం లేదు. ఇప్పట్లో ఇవి ఆగేలా కూడా లేవు. మరి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇలాంటి చర్యలకు పూనుకుంటే అవుతుందా? ఇప్పటికే జనాల్లో మోడీ పొదుపు మంత్రం జపంతో చులనకభావం ఏర్పడింది.
భయాందోళన పరిస్థితులూ కనిపిస్తున్నాయి. హిందుత్వమని ఒకటే జపం చేస్తూ ఉంటే.. బారాఖూన్ మాఫీ లాగా వీటన్నింటినీ జనం మరిచిపోయి.. బీజేపీకి ఓటేస్తారా? విజయ తీరాలకు చేర్చి అధికార పీఠాన్ని అందిస్తారా? అది జరగని ముచ్చట. అందుకే కేంద్రం కొత్త రాజకీయ స్ట్రాటజీకి తెర లేపింది. జనం నాడి తెలుసుకుని, వారి సమస్యలపై స్పందించేందుకు క్షేత్రస్థాయిలో దిగితే తప్ప.. మూలాలు బలంగా ఉండవని నమ్మింది. కేవలం మోడీ మీద పచ్చిప్రేమతో, స్వామిభక్తితో మోడీ ఎన్ని రెట్లు.. ఎన్ని సార్లు పెట్రోల్ ధరలు పెంచినా.. అది దేశం కోసం ధర్మం కోసం అని ప్రచారం చేసే బ్యాచ్ ఉండనే ఉంది. వీరి పాట వీరు పాడతారు.
కానీ నమ్మేదెవరు? ఆ నమ్మేవారి సంఖ్య తగ్గిపోతుంది. చాలు రా నాయనా మీ జై శ్రీరామ్ ముచ్చట్లు.. చేతగాని అసమర్థ పొదుపు మంత్రాలు.. నిత్యం పెంచే పెట్రోల్ రేట్లు… దీని ఫలితంగా నిత్యావసర సరకుల ధరలు కూడా మరింత పెరిగి నడ్డివిరస్తున్నాయి! అనే పెదవి విరుపు, తీవ్ర అసంతృప్తిని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో నయా స్ట్రాటజీని ఎన్నుకున్నది బీజేపీ. రైతు గోస- బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్ర షురూ చేసింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ధాన్యంకొనుగోలు అంశం మరింత జఠిలంగా మారుతూ వస్తున్నది. ఎర్రటి ఎండలో రైతులు చనిపోతున్నారు. సర్కార్ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాజకీయాలు మాట్లాడటానికి, ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడానికి చూపుతున్న చొరవ, శ్రద్ధ.. ధాన్యం కొనుగోళ్లు, రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో మాత్రం చూపడం లేదనే విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.
ఈ క్రమంలో అన్ని పార్టీలు ఇప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. వడ్ల కుప్పల దగ్గరకు పోతున్నాయి. రైతులతో మాట్లాడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే దారిని ఎంచుకున్నది. బస్సు యాత్ర పేరుతో, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి తిరుగుతున్నాయి. ముఖ్యమైన నాయకత్వమంతా ఇప్పుడు రైతు జపం చేస్తున్నది. మోడీ పొదుపు జపం పనిచేయడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. కష్టానికి తగిన ఫలం లభించేలా చేసి.. ఆదాయం పెంచే మార్గం చూపరా నాయనా.. అంటే.. ఉన్నదాంట్లో ఖర్చులు తగ్గించుకోండి.. ప్రయాణాలు తగ్గించుకోండి..అని ఉచిత సలహాలు ఇచ్చే ప్రధానిని ఈయననే చూశాం.. అని ఈసడించుకుంటున్నారు.
ఈక్రమంలో తెలంగాణలో ఉన్న గ్రాపు కాస్త పడిపోయే ప్రమాదం పొంచి ఉందని గ్రహించారు కమలనాథులు. అందుకే ప్రజల నాడి తెలుసుకుని, వారి మనసు చూరగొని, వారిలో మమేకం అవడానికి జనంబాట పట్టారు. హిందుత్వం ఒక్కటే ఓట్లు రాల్చదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట ఉండి మేమున్నామనే భరోసా ఇస్తే తప్ప.. జనం దగ్గరికి రానీయడం లేదు. దరి చేరనీయడం లేదు. అందుకే థియరీ పాఠాలు వదిలి.. ప్రాక్టికల్గగా జనం బాట పట్టారు ఆలస్యంగానైనా.