Hyderabad: హైదరాబాద్లోని మాదాపూర్ 100 ఫీట్ల రోడ్డులో అర్థరాత్రి వేళ ఒక్కసారిగా అలజడి రేగింది. అయ్యప్ప సొసైటీ పరిసరాల్లో అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు మృత్యుశకటంలా మారి బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, వాహనం ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి గాలిలోకి ఎగిరి అవతలి వైపు ఉన్న రోడ్డుపై పడింది. ఆ సమయంలో తన విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ బైకును ఈ కారు నేరుగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి భయానకంగా మారింది.
ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ వాహనం నుజ్జునుజ్జు అవ్వగా, అతనికి కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తు లేదా మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై కారు ఇంజన్ గర్జన వినిపించిన కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: రూ.20 కోసం గొడవ.. భార్యను చంపి భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త
సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా..
విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తపేట సమీపంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం నుండి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారందరూ తెర్లాం మండలంకు చెందిన వారిగా గుర్తించారు.