Custodial Death: ఒకటా.. రెండా.. దాదాపు రెండు నెలలయింది సాయికృష్ణ కనిపించకుండా పోయి. తప్పించుకున్నాడని పోలీసులు.. లేదు లేదు కృష్ణలంక పోలీసులే లాకప్ డెత్ చేశారని సాయికృష్ణ తల్లి గట్టిగా వాధించారు. సీఐ నాగరాజు నిజాయితీ గల ఆఫీసర్ అంటూ ఇటు స్థానికులు, అటు పోలీస్ ఆఫీసర్లు మద్దతుగా నిలబడి కొవ్వొత్తుల ర్యాలీలూ చేశారు. ఇలాంటి టైమ్లో ఈ కేసు కాస్త పొలిటికల్ వార్గా.. కులాల మధ్య చిచ్చుగా మారుతున్న టైమ్లో సిట్ ఎంట్రీ ఇచ్చింది. నిన్న నాగరాజును అరెస్ట్ చేసి విచారించడంతో అసలు నిజం బయటపడింది. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణది లాకప్డెత్ అనే విషయం తేలిపోయింది.
జూన్ 19న సీఐపై హత్య కేసు నమోదు
గతంలో సాయికృష్ణపై కొన్ని పాత కేసులు, అక్రమ వ్యవహారాల ఆరోపణలు ఉన్నాయి. దీంతో మే 9న నాన్బెయిలబుల్ వారెంట్పై సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. దీనిపై జూన్ 2న కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జూన్ 15న హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. జూన్ 19న సీఐపై హత్య కేసు నమోదు కావడం.. ఆ వెంటనే జూన్ 21న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. దీంతో నిన్న నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణ పేరుతో సాయికృష్ణపై సీఐ నాగరాజు అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అక్రమ నిర్బంధం కారణంగానే సాయికృష్ణ కస్టడీలోనే ప్రాణాలు విడిచాడని సిట్ నిర్ధారించింది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే స్వయంగా చూశానంటూ కృష్ణలంక ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలంతో కేసు ముగింపుకు వచ్చింది.
Also Read: సీఎం రేవంత్ కర్ణాటక పర్యటన.. కవిత సంచలన వ్యాఖ్యలు!
హైకోర్టుకు తప్పుడు సమాచారం
సాయికృష్ణ అరెస్ట్ అయిన తన ఫోన్ను నాగరాజుకు అప్పగించారు. తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ మధ్యలోనే సాయికృష్ణ చనిపోయాడు. దీంతో లాకప్డెత్ను దాచేందుకు సాయికృష్ణ శవాన్ని మాయం చేశారు నాగరాజు. శవాన్ని పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో సిట్ రంగంలోకి దిగి.. ఇప్పటివరకు 17 మంది సాక్షులను విచారించింది. సాయికృష్ణ లాకప్ డెత్ విషయం బయటకు రాకుండా ఉండేందుకు మే 1 నుంచి జూన్ 1వరకు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారు నాగరాజు. మృతదేహాన్ని అనాథ శవంగా చిత్రీకరించి స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేసినట్లు తేలింది. నిందితులు సాక్ష్యాలను మరుగుపరచకుండా ఉండేందుకు ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో ఏసీపీ కేసు నమోదు చేసిన డైరీని మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఆ డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
14 రోజుల రిమాండ్
జూన్ 23న సీఐ నాగరాజును సిట్ భారీ భద్రత నడుమ అరెస్ట్ చేశారు. జూన్ 24న హైకోర్టు విచారించగా.. నాగరాజు నిజం ఒప్పుకున్నాడు. మొదట్లో కేవలం మిస్సింగ్, హత్యాయత్నం కేసుగా ఉన్న దీనిని సిట్ అధికారులు తాజాగా హత్యానేరంగా మార్చారు. నిందితుడైన నాగరాజుపై BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడు నాగరాజును న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి జైలుకు తరలించారు. చట్టాన్ని కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారి, ఒక యువకుడి ప్రాణాలు తీసి, సాక్ష్యాలు మాయం చేసేందుకు ఒడిగట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.