Crime News: స్వేచ్చ బ్యూరో: 110 రూపాయలు..ఓ మొబైల్ ఫోన్ కోసం వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నిందితులను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన వైరును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అదనపు డీసీపీ జే.నర్సయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జైప్రకాశ్ దేశ్ ముఖ్ (38) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ వలస వచ్చాడు. మేస్త్రీగా పని చేస్తూ ఎక్కడ నిర్మాణం పనులు చేస్తుంటే అక్కడే ఆశ్రయం పొందేవాడు.
ఇదిలా ఉండగా ఈనెల 3న దేశ్ ముఖ్ తుకారాంగేట్ రైల్వే బ్రిడ్జి బైపాస్ రోడ్డులో దారుణహత్యకు గురయ్యాడు. దారిన వెళుతున్న వారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు లాలాగూడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మరకలతో ఉన్న రెండు బండరాళ్లు, అక్కడే పడి ఉన్న ఓ మద్యం సీసా, బ్రౌన్ కలర్ రెగ్జిన్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా జరిపిన తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే, హతుడు ఎవరన్నది అప్పుడు తెలియలేదు. దాంతో లాలాగూడ పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది బృందంగా ఏర్పడి విచారణ మొదలు పెట్టారు. మూడు రోజుల దర్యాప్తు తరువాత హతుడు దేశ్ ముఖ్ అని వెల్లడైంది. అప్పటికే సోషల్ మీడియాలో దేశ్ ముఖ్ ఫోటోలు చూసిన అతని కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. వారిని విచారించగా ఈనెల 2న దేశ్ ముఖ్ పని నిమిత్తం కాజీపేట వెళ్లినట్టుగా తెలిసింది. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ చేరుకున్న దేశ్ ముఖ్ మియాపూర్ లో ఉంటున్న సోదరుని ఇంటికి వెళ్లాల్సి ఉందని తెలియవచ్చింది.
Also read: చైనాలో దుమ్మురేపిన ఫోన్ ఇక ఇండియాలోకి.. ఫీచర్లు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
ఈ వివరాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు సంఘటనా స్థలం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించారు. ఇన్ఫార్మర్లను కూడా రంగంలోకి దింపారు. ఈ క్రమంలో దేశ్ ముఖ్ ను దారుణంగా హత్య చేసింది తుకారాంగేట్ నివాసి, గ్రోసరీ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న దాబీ వినోద్ (30), అడ్డగుట్టలో ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నమక్కల మోహన్ (19) అని వెల్లడైంది. గాలింపును ముమ్మరం చేసిన ప్రత్యేక బృందం ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసింది. విచారణలో దేశ్ ముఖ్ నుంచి నగదు, వస్తువులను దోచుకోవాలన్న పథకంతో అతన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దింపుతామని చెప్పి బైక్ పై ఎక్కించుకున్నట్టు నిందితులు వెల్లడించారు. నిర్జన ప్రదేశంలోకి రాగానే దేశ్ ముఖ్ వద్ద ఉన్న 110 రూపాయలు, మొబైల్ ను దోచుకోవటానికి ప్రయత్నించగా అతను అడ్డుకున్నట్టు చెప్పారు. దాంతో బండరాళ్లతో కొట్టటంతోపాటు వైరుతో ఉరి బిగించి హత్య చేశామని అంగీకరించారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి మర్డర్ కేసు నిందితులను అరెస్ట్ చేసిన లాలాగూడ సీఐ అశోక్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్, చిలకలగూడ సీఐ మధుబాబుతోపాటు ప్రత్యేక బృందంలోని సిబ్బందిని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అభినందించారు.
Also Read: ఈడ ఒక్కడు సక్కనైనోడు లేడు! మళ్లా ఒక్కడూ గెల్వడు..! బీజేపీ ఎంపీలపై సీఎం ఫైర్!