ఒక్క కిషన్రెడ్డినే కాదు.. ఏకంగా బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలను అర్సుకున్నడివాళ సీఎం. మియాపూర్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. కిషన్రెడ్డి అన్ని కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని తిట్టిన ఆయన.. ఈ సభలో మాత్రం ఎంపీలందరినీ ఏకరువు పెట్టి విమర్శించారు. మీ అందరినీ తెలంగాణ ప్రజలు గెలిపిస్తే.. మోదీ పీఎం అయ్యిండు. మరి ఇక్కడి జనం కోసం మీరేం చేస్తున్నారు? అని నిలదీశారు. ఇక్కడ ఒక్కడు కూడా మంచి నాయకుడు లేడని .. బీజేపీ ఎంపీలందరినీ ఉద్దేశించి అనడమే కాదు.. మళ్లీ దఫా ఒక్కడంటే ఒక్కడు కూడా గెలవడని రేవంత్ విమర్శించారు.
మళ్లీ ఢిల్లీ ముఖం కూడా చూడరని అన్నారు సీఎం రేవంత్. నిన్న కిషన్రెడ్డి, కేటీఆర్ను మడతబెట్టి తిట్టిన సీఎం.. ఇవాళ.. కేటీఆర్ను వదిలేశారు. ఫామ్హౌజ్లో ఉన్న కేసీఆర్ పేరును బయటకు తీశారు. కిషన్రెడ్డి, కేసీఆర్లు ఇద్దరూ తనకు సహకరించాలని, సతాయించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి చీకటి దోస్తానా తనకు తెలుసునని, కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని బలిపెట్టొద్దని కోరారు. తాను ఢిల్లీకి వెళ్లిన మూడు రోజులకే కిషన్రెడ్డి కూడా పనిగట్టుకుని ఢిల్లీ వెళ్తాడట. తను ఎవరిని కలిసి తెలంగాణ కోసం ఏమేం అడిగిండో..అవన్నీ వద్దు.. క్యాన్సిల్ చేయండని చెప్పి రావడమే అతని ఢిల్లీ పర్యటన ఆంతర్యమని.. రహస్యాన్ని చెప్పారు సీఎం. అడిగినవ్నీ ఇచ్చుకుంటూ పోతే.. మనకెక్కడ పేరొస్తది… కాంగ్రెసోళ్లకే పేరొస్తది.. మళ్లా వాళ్ల ప్రభుత్వమే వస్తది.. ! వద్దు వద్దు… క్యాన్సిల్ .. క్యాన్సిల్ అని చెప్పేసి వస్తాడట కిషన్రెడ్డి.
ఈ ఢిల్లీ టూర్ తతంగమంతా బహిరంగ వేదిక మీద చెప్పడం.. ఇప్పుడు చర్చకు తెర తీసింది. పార్టీలకతీతంతా నగరాన్ని అభివృద్ది చేసుకోవాలె గానీ.. ఇలా కాళ్లల్లో కట్టెలడ్డం పెట్టినట్టు చేస్తే.. మళ్లీ దఫా ఒక్కడంటే ఒక్కడు కూడా ఎంపీగా గెలవడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. మాట్లాడితే ఏం చేశారని తనను ప్రశ్నిస్తున్నారని, పదేండ్లలో కేసీఆర్ ఏం చేశాడో.. మోడీ ఏం చేశాడో.. రెండున్నరేండ్లలో తనేం చేశానో.. అన్నీ అసెంబ్లీలో చర్చిద్దాం రండి.. నాలుగు రోజుల స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేయిస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు దొరకడం కష్టమని, కబ్జాల్లో ఉన్న జాగాలకు విముక్తి కలిగించి.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తానని నగరవాసులకు హామీ ఇచ్చారు సీఎం.
ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆడబిడ్డలకు నెలకు రూ. 10వేల వరకు ఆదా అవుతుందని, వారెంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఆడబిడ్డలు మొదటి ప్రయార్టీ కాగా.. యువతను సెకండ్ ప్రయార్టీగా తీసుకుని పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణపై కక్షగట్టి ఒకరు ఫామ్హౌజ్కు పరిమితమయ్యారని, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇక్కడ పుట్టగతుల్లేకుండా పోతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లీడర్లంతా బస్తీబాట పట్టాలని, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని, ఆశావహులందరికీ బీఫారాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తానన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురయిందని, తమ పాలనలో వికాసం వైపు నడుస్తున్నదని అన్నారు. ఆరు నెలలు మినహాయిస్తే.. ఇంకా ప్రభుత్వానికి 24 నెలల కాలం ఉందని, ఈ సమయమంతా రోజుకు 18 గంటలు పనిచేసి నగరాన్ని ప్రపంచనగరంగా తీర్చిదిద్దుతానన్నారు. ఆ లాస్ట్ ఆరు నెలలే రాజకీయాలు చేద్దామన్నారు సీఎం రేవంత్.