Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హుకుంపేట మండలం, రాళ్ళగెడ్డ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున టూరిస్ట్ కారు అదుపు తప్పి బ్రిడ్జిని బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో.. వంజంగి నుంచి అరకు వైపు వెళ్తున్న టూరిస్ట్ కారు అదుపు తప్పి బ్రిడ్జిని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం వంజంగి వ్యూ పాయింట్ చూసి తిరిగి ప్రయాణమవుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఈ కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతి చెందిన స్టూడెంట్ ను నెల్లూరు వాసిగా గుర్తించారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో చదువుతున్న రుద్ర అని పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని చికిత్స నిమిత్తం హుకుంపేట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై హుకుంపేట సీఐ సన్యాసినాయుడు, ఎస్సై సూర్యనారాయణ పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.