Siddipet Crime: నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ శివారులో ఈ రోజు సాయంత్రం వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
ప్రాథమిక సమాచారం మేరకు.. జక్కాపూర్ శివారులో ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్లో ప్రయాణించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బైక్ను ఢీకొట్టిన ధాటికి వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. బైక్పై ఉన్నవారు దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తుకు ఎగిరి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద తీవ్రతను చూస్తే..బైక్ పై ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెనుక నుంచి వస్తున్న మరో కారు డాష్ బోర్డు కెమెరాలో (డాష్క్యామ్) స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియో క్లిప్ స్థానికంగా వైరల్ అవుతూ.. ప్రమాద తీవ్రతను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.
ALSO READ: Infant murder Vizag: అమావాస్య రోజు నరబలి ఇచ్చారా?, విశాఖలో తల లేని చిన్నారి మృతదేహం లభ్యం!