Infant murder Vizag: విశాఖపట్నం జిల్లాలో అత్యంత దారుణమైన, అమానుష ఘటన వెలుగుచూసింది. తాటిచెట్లపాలెం, రాజీవ్ నగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక పసిబిడ్డను అతి కిరాతకంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా నరికి కాలువలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
విశాఖలోని కప్పరాడ, బేతెస్థ చర్చి సమీపంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 1:00 నుండి 1:30 గంటల సమయంలో ఈ ప్రాంతంలో కుక్కలు విపరీతంగా అరిచాయి. ఆ సమయంలో ఓ స్థానికుడు బయటకు వచ్చి చూడగా ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి లోపలికి వెళ్లిపోయారు. అయితే తెల్లవారేసరికి ఇంటి సమీపంలోని కాలువ వద్ద కోడి మాంసం ముక్కల్లా నరికి పడేసిన శరీర భాగాలు కనిపించాయి. మొదట ఒక కాలును చూసి అది బొమ్మ కాలు అనుకున్నామని, దగ్గరికి వెళ్లి చూస్తే అది మనిషి కాలు అని తెలిసి షాక్ అయ్యామని స్థానికులు వాపోయారు.
తల లేని మొండెం – మిస్టరీ:
హత్యకు గురైన చిన్నారి శరీరాన్ని నిందితులు ముక్కలు ముక్కలుగా చేశారు. మొండెం, కాళ్ళు వేర్వేరుగా పడి ఉన్నాయి. అయితే చిన్నారి తల మాత్రం అక్కడ కనిపించలేదు. పాపను గుర్తించకుండా ఉండేందుకే నిందితులు తలను వేరే చోట పడేసి ఉంటారని లేదా తీసుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తల దొరికితే తప్ప అది ఆడపిల్లా, మగపిల్లా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు.
క్షద్రపూజలా? అక్రమ సంబంధమా?
నిన్న అమావాస్య కావడంతో ఎవరైనా క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, అక్రమ సంబంధం లేదా ఇష్టం లేని సంతానం కావడంతో కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. “పుట్టిన బిడ్డ భారం అనుకుంటే అనాథాశ్రమంలో ఇవ్వాలి కానీ, ఇలా కోడిని, మేకను నరికినట్లు నరకడం రాక్షసత్వం” అని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీసుల దర్యాప్తు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా లేదా డిఎన్ఏ (DNA) టెస్టుల ద్వారా చిన్నారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రాజీవ్ నగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతటి క్రూరత్వానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.