Siddipet Crime: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో తీరని విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వలస కూలీలను మృత్యువు కబళించింది. కస్తూరిపల్లి గ్రామంలో ఉన్న చెక్ డ్యామ్లో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
బీహార్ రాష్ట్రం నుంచి రెండు కుటుంబాలు ఐదు రోజుల క్రితమే ఉపాధి కోసం కస్తూరిపల్లికి వచ్చాయి. సాయంత్రం స్నానం చేసేందుకు 12 ఏళ్ల కిరణ్ కుమార్, 6 ఏళ్ల బిర్జు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట పడి ఇద్దరు గల్లంతయ్యారు. గమనించిన ఉమా దేవి .. ఆ చిన్నారులను కాపాడే క్రమంలో తాను కూడా నీటిలో దిగి గల్లంతయ్యింది.
స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే వచ్చిన వారు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి. మృతుల్లో ఉమా దేవి, ఆమె కుమారుడు కిరణ్ ఉండటంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.
ALSO READ: Iran: అగ్నిగుండంలా ఇరాన్.. ఖమేనీ పని ఖతం.. !