మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మంత్రిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడే వారికి బుద్ధి లేదని ఆయన మండిపడ్డారు.
అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక చరిష్మా ఉన్న నేత అని జగ్గారెడ్డి కొనియాడారు. ఎన్ఎస్ యుఐ విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టి.. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తుచేశారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న వ్యక్తిపై ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయడం సరికాదన్నారు.
వ్యక్తిత్వ హననంపై తీవ్ర ఆగ్రహం
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ఆడ, మగ మాట్లాడుకుంటే పెడర్థాలు తీస్తారా? ఇది ఏమైనా ప్రజా సమస్యనా? లేక రాష్ట్ర సమస్యనా?’ అని ప్రశ్నించారు. చేతిలో కలం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు రాస్తారా అని నిప్పులు చెరిగారు. సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఇలాగే రాస్తారా అని ప్రశ్నిస్తూ.. ఇదెక్కడి సంప్రదాయమని నిలదీశారు. పనిగట్టుకుని మంత్రి పర్సనాలిటీ డ్యామేజ్ చేయాలని చూస్తున్న వారిని ఫూల్స్ అంటూ సంబోధించారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
లక్షలు, కోట్లు అప్పులు చేసి ప్రజలకు సేవ చేస్తున్న నేతలను బద్నాం చేయడం మానుకోవాలని జగ్గారెడ్డి హెచ్చరించారు. నాలుగు అక్షరాలు వచ్చు కదా అని చెత్త వార్తలు రాసే వారు, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను వెలికితీయాలని సూచించారు. కోమటిరెడ్డిపై వార్తలు రాయాలని వెనకుండి ప్రోత్సహించే వారికి బయటకు వచ్చి చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇటువంటి రాతల వల్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిత్వం ఏమాత్రం దెబ్బతినదని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: Cyber crime: మాజీ ఐపీఎస్ అధికారి దంపతులకు సైబర్ టోకరా.. ఏకంగా రూ. 2.58 కోట్లు స్వాహా!