Bus Accident: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి ఏదొక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్-యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి మెట్రోపిల్లర్ను ఢీకొట్టబోయింది. ఆపై రోడ్డు పక్కనే సిమెంట్ పైపులపైకి దూసుకెళ్లి బ్యాలెన్స్ తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు విషయం గమనించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటికి దించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం తృటిలో తప్పిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: ORR పై ఘోర ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవదహనం
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ను విచారిస్తున్నారు. రాత్రి పూట డ్యూటీలు, నిరంతర ప్రయాణాలు డ్రైవర్లలో అలసట, నిద్రమత్తుకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.