Hyderabad: స్వేచ్ఛ బ్యూరో: గంజాయి ట్రాన్స్ పోర్టర్ గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్ ను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు, ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 79లక్షల రూపాయల విలువ చేసే 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామానికి చెందిన పనగూడ శివకృష్ణ ప్రస్తుతం కేరళ రాష్ట్రం త్రివేండ్రం జిల్లాలో నివాసముంటున్నాడు. 2009లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత డిప్యూటేషన్ పై ఎన్డీఆర్ఎఫ్ లో పని చేశాడు. కాగా, విధుల్లో ఉంటూనే ఆర్థిక సమస్యల నుంచి బయట పడతానికి గంజాయి దందా చేస్తూ పట్టుబడటంతో ఉన్నతాధికారులు అతన్ని గత సంవత్సరం విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు.
విధుల్లో నుంచి సస్పెండ్ చేయటంతో మరింతగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న శివకృష్ణ పలువురి నుంచి అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కానరాక పోవటంతో గంజాయి ట్రాన్స్ పోర్టర్ గా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గంజాయి సాగుదారుని నుంచి గంజాయిని సేకరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు తీసుకెళ్లి పెడ్లర్లకు అందచేయటం మొదలు పెట్టాడు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న సమయంలో చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఆపితే తన కానిస్టేబుల్ గుర్తింపు కార్డును చూపించి తప్పించుకునేవాడు. శివకృష్ణ గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ యదేందర్, ఎస్ఐ రవిరాజ్ తోపాటు సిబ్బందితో కలిసి నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద అరెస్ట్ చేశారు. అతని నుంచి గంజాయితోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్కు ఏలేటి సవాల్!