Maheshwar Reddy: స్వేచ్ఛ బ్యూరో : ధాన్యం కొనుగోలు అంశంపై తాను వాస్తవాలతో సహా ఒక్కడినే వస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మొత్తంతో కలిసి వస్తే.. వాస్తవాలేంటో నిరూపిస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మైక్ దొరికితే సీఎం నోటికొచ్చిన అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రతి గింజ కొంటానని మాట్లాడి.. ఇప్పుడెందుకు కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంకెలపై మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన లేదని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకు కొనకుంటే రైతులతో వచ్చి సీఎం ఇంటి ఎదుట కూర్చుంటామని ఏలేటి హెచ్చరించారు.
గింజలు సీఎం ఇంటి ఎదుట పోయాలా? లేదంటే గాంధీ భవన్ ఎదుట పోయాలా? అని నిలదీశారు. కాంగ్రెస్ కంటే.. గత ప్రభుత్వం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. 1వ తేదీలోపు మొత్తం కొనుగోలు చేస్తామని అన్నారని, 3వ తేదీ వచ్చినా ఎందుకు కొనలేదని నిలదీశారు. రేవంత్ కు అధికారంలో కొనసాగే అర్హత లేదని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై తాను ఓపెన్ డిబేట్ కు సిద్ధమని, సీఎం, మంత్రులు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని ఏలేటి సవాల్ విసిరారు.
లక్ష ఇండ్ల నిర్మాణం ఎక్కడా జరగలేదన్నారు. గృహ నిర్మాణాలు ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర వాటతో మాత్రమే ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. లక్ష ఇళ్లకు డబ్బు ఇచ్చిన ఆధారాలు ఎక్కడా లేవన్నారు. కేంద్రం డబ్బులతో ఇల్లు కట్టి ఇందిరమ్మ అని పేరు పెట్టేందుకు సిగ్గుందా అని ఏలేటి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవని చెబుతోందని, మరి మూసీ, తమ్మిడిహెట్టికి ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి నిర్మాణానికి అంతరాష్ట్ర పర్మిషన్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారా? అని ప్రశ్నించారు. అసలు దీనికి ప్రణాళిక ఎక్కడ? సోర్స్ ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
Also Read: పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!