Tamil Nadu cracker unit blast: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కట్టనార్పట్టి సమీపంలోని ఒక బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పేలుడు ధాటికి కర్మాగారంలోని గదులన్నీ ధ్వంసమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. కర్మాగారంలో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలను నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు. మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధిత కుటుంబాలను ఓదార్చాలని ముఖ్యమంత్రి సూచించారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో సంభవించిన బాణసంచా కర్మాగార పేలుడు ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
“తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందిస్తూ కార్మికుల కష్టాలను గుర్తు చేసుకున్నారు. “విరుదునగర్ జిల్లా కట్టనార్పట్టిలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. వీరంతా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఉదయాన్నే ఇళ్ల నుండి బయలుదేరిన సామాన్య కార్మికులు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని ఆయన పేర్కొన్నారు. శ్రమజీవులైన కార్మికులు ఇలాంటి అగ్ని ప్రమాదాలకు బలికావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: రీల్స్ పిచ్చి.. ముగ్గురు బలి.. తుపాకీతో విన్యాసాలు చేస్తూ ట్రక్కును ఢీకొట్టిన యువత