SIM Racket: స్వేచ్చ బ్యూరో: కాంబోడియా దేశంలో ఉంటూ మన దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న చైనా గ్యాంగుకు సిమ్ కార్డులు సప్లయ్ చేస్తున్న 5గురిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నిందితులు ఇచ్చిన 6వందల సిమ్ కార్డుల సహాయంతో సైబర్ కేటుగాళ్లు జనం నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా విచారణలో వెల్లడైంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నివాసి సయ్యద్ అష్రఫ్ అలీ (30) 2023లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ లో ఉద్యోగానికి కుదిరాడు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెంది దుబాయ్ లోని గేమింగ్ కాల్ సెంటర్ లో పని చేస్తున్న రిజ్వాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే రిజ్వాన్ భారత్ కు చెందిన సిమ్ కార్డులను సప్లయ్ చేస్తే కమీషన్ గా భారీ మొత్తాల్లో డబ్బు ఇస్తానని సయ్యద్ అష్రఫ్ అలీతో చెప్పాడు. దీనికి అంగీకరించిన సయ్యద్ అష్రఫ్ అలీ పాతబస్తీ తలాబ్ కట్ట ప్రాంత నివాసి సయ్యద్ సొహైల్, జూబ్లీహిల్స్ కు చెందిన అఫీఖ్ అహమద్, కరీంనగర్ కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామ వాస్తవ్యుడు నూనె అశోక్ లను తనతో కలుపుకొన్నాడు.
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు! గ్రామసభల ద్వారా
వీరిలో సయ్యద్ సొహైల్ జియా, ఎయిర్ టెల్ లలో ప్రమోటర్ గా పని చేస్తుండగా అఫీఖ్, అశోక్ లు ఎయిర్ టెల్ స్టోర్లను నడుపుతున్నారు. ఈ ముగ్గురు ఇతరులకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి గడిచిన మూడేళ్లలో 6వందలకు పైగా సిమ్ కార్డులను సయ్యద్ అష్రఫ్ అలీకి ఇచ్చారు. వీటిని అష్రఫ్ అలీ కాంబోడియా వెళ్లి సైబర్ క్రిమినల్స్ కు ఇస్తూ వచ్చాడు. ఇలాగే రిజ్వాన్ సూచనల మేరకు గత నెల 31న మరో 198 సిమ్ కార్డులతో సయ్యద్ అష్రఫ్ అలీ కాంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన తనిఖీల్లో సిమ్ కార్డులు బయట పడ్డాయి. దాంతో అతన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు అప్పగించారు.
విచారణలో 2023 నుంచి ఈ దందా చేస్తున్నట్టుగా సయ్యద్ అష్రఫ్ అలీ వెల్లడించాడు. ఇప్పటివరకు కాంబోడియాకు ఆరుసార్లు వెళ్లి సిమ్ కార్డుల డెలివరీ ఇచ్చినట్టుగా చెప్పాడు. ఈ నెట్ వర్క్ లో మరికొందరు ఉన్నారని తెలిపిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు చెప్పారు. సిమ్ కార్డులు తీసుకునే ముందు..బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంచార్ సాథీ యాప్ ద్వారా సిమ్ కార్డుల డేటాను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. తమ పేరన అనధికారికంగా సిమ్ కార్డులు మంజూరైనట్టు తెలిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్ భవన్లో కొత్త చర్చ కలకలం.. గులాబీ పార్టీని నడిపించేదెవరు..?