Alluri Sitarama Raju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతం వద్ద సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల కథనం ప్రకారం.. హుకుంపేట మండలం జుంబువలస గ్రామానికి చెందిన నలుగురు బాలికలు సరదాగా గడపడానికి మూలగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం అందాలను తమ ఫోన్లలో బంధించాలని, సెల్ఫీ దిగాలని వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరు కాలు జారి లోతైన నీటి కుంటలో పడిపోగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మరో బాలిక అంజలి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెను వెంటనే అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులంతా హుకుంపేట మండల నివాసులు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షల ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు విహారయాత్రకు వెళ్లిన ఈ విద్యార్థినులు, తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.
సెల్ఫీ వ్యామోహం ప్రాణాల మీదకు తెస్తుందని అధికారులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇటువంటి ఘటనలు పునరావృతమవడం కలచివేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని జలపాతాల వద్ద బండరాళ్లు జారుడుగా ఉంటాయని, నీటి లోతుపై అవగాహన ఉండదని పర్యాటకులు గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురి మృతి
జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతగిరి… pic.twitter.com/jpugurZc61
— ChotaNews App (@ChotaNewsApp) April 9, 2026
Read Also: మణిపూర్లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి