Online Betting: ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు, సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో ఒక యువకుడు ఈ వ్యసనానికి బలైపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంద సాయికుమార్ (23) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, తన తండ్రికి తోడుగా చికెన్ సెంటర్లో పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకునేవాడు. అయితే, సరదాగా మొదలైన ఆన్లైన్ గేమింగ్ క్రమంగా బెట్టింగ్ వ్యసనంగా మారి అతని ప్రాణాల మీదకు తెచ్చింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి..
సాయికుమార్ గత కొంతకాలంగా వివిధ ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్లు కాస్తూ భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 95 వేల వరకు నష్టపోవడంతో, ఆ అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు, సామాజికంగా ఎక్కడ పరువు పోతుందోనన్న భయాందోళనలు అతనిని కుంగదీశాయి. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
చికిత్స పొందుతూ కన్నుమూత..
అపస్మారక స్థితిలో ఉన్న సాయికుమార్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనిని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. కళ్ల ముందే చేతికి వచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: థానేలో పాముతో ఎక్కాడు.. టాయిలెట్లో వదిలాడు.. కిలాడీ జగన్ అర్జున్ భాలే అసలేం చెప్పాడంటే?
యువతకు హెచ్చరిక..
ఈ విషాద ఘటన ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల యువత ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ చివరకు ప్రాణాల మీదకు తెస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్పుల బాధలో ఉన్నవారు ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా, కుటుంబ సభ్యులకు లేదా కౌన్సిలర్లకు చెప్పుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇటువంటి బెట్టింగ్ యాప్ల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గొల్లచర్ల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.