Jangaon District: జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో గురువారం సాయంత్రం తీరని విషాదం చోటుచేసుకుంది. సరదాగా జాతర చూడటానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె మనోజ్ (12), గూటం అకిరా నందన్ (13) అనే ఇద్దరు స్నేహితులు నష్కల్ గ్రామంలోని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న జాతరను చూసేందుకు సైకిల్పై వెళ్లారు. జాతర చూసిన అనంతరం తిరిగి వస్తూ.. నష్కల్ రామాలయం సమీపంలోని ఆకేరు వాగు వద్దకు చేరుకున్నారు. తమ సైకిల్ను కడగాలనే ఉద్దేశంతో వారు వాగులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారు.
సాయంత్రం సమయానికి వాగు ఒడ్డున వారి సైకిల్, చెప్పులు ఒంటరిగా కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, ఇద్దరు బాలురు నీటిలో మునిగి మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ పిల్లల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను వరంగల్లోని MGM ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హఠాత్పరిణామంతో వంగాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే ఇద్దరు బాలురు మృత్యువాత పడటంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సామాన్యులకు షాక్.. ఏయే వస్తువులపై ధరలు పెరిగాయంటే?