Adulterated Mangoes: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మీ ఇష్టమైన పండు ప్రాణాంతకమైన విషంగా మారే ప్రమాదం ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. మార్కెట్లో దొరికే రంగు రంగుల మామిడి పండ్ల వెనుక “విషపు కోరలు” దాగి ఉన్నాయన్న నిజాన్ని విస్మరించకూడదని ఆయన సూచించారు. కేవలం లాభాల కోసమే చూసే కొందరు వ్యాపారులు, సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాల్షియం కార్బైడ్.. పండు వెనుక ఉన్న మృత్యువు!
సాధారణంగా మామిడి పండ్లు చెట్టు మీద సహజంగా మగ్గడానికి సమయం పడుతుంది. కానీ, కాసుల కక్కుర్తితో వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనం ద్వారా పండు పైన పచ్చగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం విషపూరితమై ఉంటుంది. ఇలా కృత్రిమంగా మగ్గించిన పండ్లను తినడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పులివే..
కృత్రిమంగా మగ్గించిన పండ్లను తిన్నప్పుడు వెంటనే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని ప్రభావం కేవలం జీర్ణవ్యవస్థపైనే కాకుండా, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, చర్మ సంబంధిత అలర్జీలకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల విషయంలో ఈ రసాయన పండ్లు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే పండు రంగును చూసి మోసపోకుండా, దాని నాణ్యతను పరిశీలించడం చాలా ముఖ్యం.
అసలైన పండును గుర్తించడం ఎలా?
కృత్రిమంగా మగ్గించిన పండ్లను కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు:
రంగు: రసాయనాలు వాడిన పండ్లు ఒకే రంగులో (ముదురు పసుపు) ఆకర్షణీయంగా ఉంటాయి. సహజంగా పండిన పండులో అక్కడక్కడా ఆకుపచ్చ మచ్చలు ఉంటాయి.
రుచి: కల్తీ పండు పైన తీపిగా ఉన్నా, లోపల చప్పగా లేదా వగరుగా ఉంటుంది. తిన్నప్పుడు గొంతులో మంటగా అనిపిస్తుంది.
నీటి పరీక్ష: ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి, రసాయనాలతో మగ్గించినవి నీటిపై తేలుతాయి.
Also Read: రంగురంగుల చాక్లెట్.. నిలువునా ముంచే విషం.. మీ బిడ్డకు ఇచ్చేది ప్రేమా? లేక మరణాన్నా?
జాగ్రత్తే శ్రీరామ రక్ష!
మార్కెట్ వెళ్ళినప్పుడు ఆకర్షణీయమైన రంగుకు ఆశపడి రోగాలను కొని తెచ్చుకోవద్దు. సాధ్యమైనంత వరకు నమ్మకమైన రైతుల దగ్గర లేదా ఆర్గానిక్ స్టోర్స్ లో పండ్లను కొనుగోలు చేయండి. ఒకవేళ బయట కొంటే, ఆ పండ్లను కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టి, పైన తోలు తీసి తినడం ఉత్తమం. సీపీ సజ్జనార్ సూచించినట్లుగా.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి కల్తీ వ్యాపారుల గురించి అధికారులకు సమాచారం అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలి.
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త:సీపీ సజ్జనార్
ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు..
దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు:సీపీకాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు:సీపీ
మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను… pic.twitter.com/L3vpQk6Ikl
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2026