Nagarkurnool District: దారుణం.. ప్రస్తుత కాలంలో సమాజం మారుతున్న కుల పిచ్చి మాత్రం తగ్గడం లేదు.. ఈ కుల వివక్ష అనే మహమ్మారి పసిప్రాణాలను బలితీసుకోవడం అత్యంత దురదృష్టకరం. అయితే నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భక్తితో మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లిన ఒక నిరుపేద కుటుంబానికి సామాజిక వివక్ష రూపంలో చావు దెబ్బ తగిలింది. దైవ సన్నిధిలో అందరూ సమానమే అన్న సూత్రాన్ని విస్మరించి, కేవలం కులం పేరుతో అడ్డుకోవడం మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలకు నిదర్శనంగా నిలిచింది.
తోపులాటలో అనంత లోకాలకు..
బాధిత మహిళ చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, దేవుడి దర్శనం కోసం వెళ్తున్న తరుణంలో కొందరు అగ్రకుల వ్యక్తులు తమను అడ్డుకున్నారని, ఆ క్రమంలోనే వాగ్వాదం పెరిగి దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణ, తోపులాట మధ్య, తల్లి ఒడిలో ఉన్న రెండు నెలల పసిపాప తీవ్రంగా నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఊపిరి పోసుకోవాల్సిన చోటే ఆ చిన్నారి ఊపిరి ఆగిపోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుల అహంకారం ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
న్యాయం కోసం బాధితుల పోరాటం..
తమ బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధితులు పసికందు మృతదేహంతో హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనివల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ, తమకు జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియాలన్న ఆవేదన వారిలో కనిపించింది. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, తమ బిడ్డ మృతికి బాధ్యులైన వారికి శిక్ష పడే వరకు వెనకడుగు వేసేది లేదని బాధితులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: భార్య-ముగ్గురు పిల్లలను చంపి, యజమాని ఆత్మహత్య, యూపీలో దారుణం
సమాజం మేల్కొనాల్సిన సమయం
ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని వచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా ఇలాంటి అంటరానితనం, వివక్ష కొనసాగడం విషాదకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరం. దేవుడి గుడిలోనూ కులాల కుమ్ములాటలు పసిప్రాణాలను బలిగొనడం సమాజపు నైతిక పతనానికి సంకేతం. బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, ఇలాంటి అమానవీయ పోకడలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అగ్రకులాల వారు దేవుడి దర్శనానికి అడ్డుకుని, తమపై దాడి చేశారని చంద్రకళ అనే మహిళ ఆరోపించారు. ఈ తోపులాటలో రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతదేహంతో బాధితులు హైవేపై ఆందోళనకు దిగడంతో… pic.twitter.com/skMIwKqFzh
— ChotaNews App (@ChotaNewsApp) February 22, 2026