Thummala Nageswara Rao: యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఉన్నారని పదే పదే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను గోస పెట్టారో రైతాంగానికి మొత్తం తెలుసు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో కూడా ప్రజలకు తెలుసు అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు.
సిద్దిపేట, గజ్వేల్లో ఎరువుల కోసం క్యూ లైన్లు ఉన్న సందర్భాలు, క్యూ లైన్లలో రైతులు మృతి చెందిన సందర్భాలు మరిచారని, ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యలతో ఏర్పడిన రద్దీని కూడా రాజకీయంగా వాడుకొనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారని మండిపడ్డారు. రైతులు కొనుగోలు చేయకుండానే 7.60 లక్షల టన్నులు యూరియా ఈ యాసంగిలో అమ్ముడుపోయిందా? అని నిలదీశారు. వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉందా? అని నిలదీశారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు రైతులు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. మొక్కజొన్న వద్దు, కంది వద్దు, పత్తి వద్దు అనే పరిమితులు పెట్టారని, ఏవో పంటకాలనీలు అని, ఎరువులు ఫ్రీ అన్నారని ఏదీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Ustaad Bhagat Singh Update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి అదిరిపోయే అప్టేట్.. రాశి ఖన్నా ఏం చెప్పారంటే?
యాసంగి కి 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే ఇప్పటికే 8.42 లక్షల మెట్రిక్ టన్నులు తెప్పించామని, 7.60 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు అందజేశామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న నేతలకు ఎరువుల విక్రయాలు ఈపాస్ మిషన్ లతో జరుగుతాయన్న విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. యాప్ తో 22 జిల్లాల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 2.64 కోట్ల బస్తాల యూరియాను కొనుగోలు చేశారని, ఇది తెలియని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వంపై రైతులకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని ఇప్పటికే రుజువు చేసుకున్నామని వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?