Hyderabad: హైదరాబాద్లోని ఉప్పల్ పరిధిలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొరుగు మహిళ పెట్టిన అక్రమ కేసుతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన పద్మావతి కాలనీలోని అర్జున్ శ్రీనివాసం అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
గత ఆగస్టు నెలలో విష్ణుప్రియ అనే మహిళ ఇక్కడ అద్దెకు దిగింది. అయితే ఆమె ప్రవర్తన మొదటి నుంచీ వివాదాస్పదంగా ఉంది. ఆమె అపార్ట్మెంట్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోందని, క్షుద్ర పూజలు చేస్తూ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యుడైన రాకేష్ రెడ్డి ఇతర నివాసితులతో కలిసి ఆమెను నిలదీశారు.
ఈ గొడవ నేపథ్యంలో విష్ణుప్రియ రాకేష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ నిమిత్తం రాకేష్ రెడ్డిని పిలవడంతో, సమాజంలో తన గౌరవానికి భంగం కలిగిందనే తీవ్ర ఆవేదనకు ఆయన లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు.
రాకేష్ రెడ్డి మరణవార్త తెలియడంతో ఆగ్రహించిన బంధువులు, స్థానికులు విష్ణుప్రియ ఇంటి ముందు భారీ ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేశారు. ఒక అమాయకుడు ప్రాణం పోవడానికి కారణమైన సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు