Chinese Manja Incident: మేడ్చల్ జిల్లా ఉప్పల్లో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. నిషేధిత చైనా మాంజా వల్ల మరో ప్రాణం ప్రమాదంలో పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సాయి వర్ధన్ రెడ్డి తన బైక్పై వెళ్తుండగా, గాలిలో ఎగురుతూ వచ్చిన గాలిపటం మాంజా ఊహించని విధంగా అతని మెడకు చుట్టుకుంది.
బైక్ వేగంగా ఉండటంతో, ఆ నైలాన్ దారం (చైనా మాంజా) మెడ నరాలను బలంగా కోసేసింది. దీంతో ఒక్కసారిగా రక్తపు మడుగులో పడిపోయిన సాయి వర్ధన్ రెడ్డిని గమనించిన బాటసారులు, వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో సాయి వర్ధన్ మెడపై లోతైన గాయమైందని, శ్వాసనాళం వరకు దారం వెళ్ళిందని వైద్యులు తెలిపారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడం వల్ల ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య బృందం వెల్లడించింది. అయితే, ఈ దాడి వల్ల కలిగిన గాయం మానడానికి కొంత సమయం పడుతుందని, ప్రస్తుతం అతను ఐసీయూలో పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వం, పోలీసులు చైనా మాంజా అమ్మకాలపై ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ముఖ్యంగా పండుగ సీజన్ సమీపిస్తుండటంతో, గాలిపటాలు ఎగురవేసే వారు వాడే ఈ నిషేధిత మాంజా పక్షులకే కాకుండా, వాహనదారులకు మృత్యుపాశంగా మారుతోంది. నైలాన్, గాజు పొడితో తయారు చేసే ఈ దారం తెగకపోవడం వల్ల, గొంతు కోసుకుపోయి గతంలో కూడా నగరంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు.. 120 ఏళ్ల నాటి మండువా లోగిళ్లు.. ఎలా ఉన్నాయో చూస్తే!
ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఇలాంటి ప్రమాదకరమైన మాంజాలను కొనుగోలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా టూవీలర్లపై వెళ్లేవారు మెడకు స్కార్ఫ్ కట్టుకోవడం లేదా హెల్మెట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అప్పుడే ఇలాంటి “ముదనష్టపు” మాంజా వల్ల జరిగే అనర్థాలను అరికట్టవచ్చని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
చైనా మాంజా వల్ల మరో వ్యక్తి మెడకు గాయం
హైదరాబాద్-ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు గాయాలు
మెడపై లోతైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని… pic.twitter.com/hIEAvr59Ia
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2026