Ragging Incident: విజయవాడలో ర్యాగింగ్ పేరిట వేధింపులు కలకలం రేపుతున్నాయి. స్థానిక సిద్ధార్థ కాలేజీలో సీనియర్లు రెచ్చిపోయారు. 30మందికి పైగా జూనియర్లను వేధించినట్లు సమాచారం. కాళ్లు పట్టాలని.. తమ దుస్తులు ఉతకాలని.. తిన్న ప్లేట్లు కడగాలంటూ ప్రతిరోజు సీనియర్లు వేధిస్తున్నట్లు జూనియర్లు వాపోతున్నారు. అంతేకాదు మెస్ నుంచి భోజనం తేవాలంటూ ఆర్డర్స్ చేస్తున్నట్లు జూనియర్లు చెబుతున్నారు.
ఇక మాటవినని వారిని హాస్టల్ గదిలో నిర్బందించినట్లు తెలుస్తుంది. అయితే కంప్లయింట్ చేస్తే యాక్షన్ ఇంకోలా ఉంటుందని జూనియర్లను.. సీనియర్లు హెచ్చరించారు. ఏం చేయాలో అర్థంకాక పలువురు స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
విషయం వెలుగులోకొచ్చిన వెంటనే కొంతమంది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్టల్కు వెళ్లి పరిశీలించారు. బాధిత విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక కాలేజీ యాజమాన్యం కూడా ఈ ఘటనపై అంతర్గత విచారణ ప్రారంభించింది. సంస్థలో ర్యాగింగ్కు ఏమాత్రం స్థానం లేదు అని కాలేజీ అధికారులు ప్రకటించినప్పటికీ, జరిగిన ఘటనపై విద్యార్థులలో భయం నెలకొంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం
ఈ ఘటన వెలుగులోకి రావడంతో జూనియర్లు భవిష్యత్తులో.. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హాస్టల్లో సీసీటీవీలు, వార్డెన్ల పర్యవేక్షణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలు మరింత బలపర్చాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు.