Vijayawada Btech Student Incident: విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ ప్రదర్శించిన అత్యుత్సాహం, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలను బలిగొనగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కేసరపల్లికి చెందిన ప్రణయ్, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం తన తమ్ముడు కౌశిక్ను కాలేజీలో దింపేందుకు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ప్రణయ్ బైక్పై వస్తుండటం గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక్కసారిగా అతడి బైక్ హ్యాండిల్ను పట్టుకుని లాగాడు. వేగంగా వెళ్తున్న బైక్ హ్యాండిల్ను అకస్మాత్తుగా లాగడంతో ప్రణయ్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న కౌశిక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం కౌశిక్ పెన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి (CCTV) దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక రౌడీ మాదిరిగా, ‘లైసెన్స్ ఉన్న కిల్లర్’ లాగా కానిస్టేబుల్ వ్యవహరించాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారిని ఆపడానికి బారికేడ్లు వేయడం లేదా వెహికల్ నంబర్ ద్వారా ట్రేస్ చేయడం వంటి పద్ధతులు ఉంటాయి తప్ప, ఇలా రద్దీగా ఉండే రోడ్డుపై హ్యాండిల్ లాగి ప్రాణాలు తీయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రక్షకులుగా ఉండాలి తప్ప, ఇలాంటి ప్రాణాంతక చర్యలతో భక్షకులుగా మారకూడదని ప్రజలు మండిపడుతున్నారు.
ఒకే ఇంట్లో ఒక కొడుకు మరణించడం, మరో కొడుకు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉండటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’కు బాధ్యుడైన కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ హోం మంత్రి, ఉన్నతాధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి, విధి నిర్వహణలో ఇటువంటి అత్యుత్సాహాన్ని అరికట్టాలని మేధావులు కోరుతున్నారు.
Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. ఆటోను ఈడ్చుకెళ్లిన లారీ.. స్పాట్లోనే నలుగురు!