Bhuvanagiri Incident: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుక్కాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన వెలుగుచూసింది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడిలా మారి, తన 14 ఏళ్ల కుమార్తెను అత్యంత క్రూరంగా హతమార్చింది. మానసిక అనారోగ్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి కుమార్తె రత్నకళ అలియాస్ నీలిమకు, బీబీనగర్ మండలం జైనిపల్లికి చెందిన రైతు బెజ్జంకి నరేంద్ర రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె కృతిరెడ్డి(14), కుమారుడు అక్షిత్ ఉన్నారు. గత రెండేళ్లుగా నీలిమ సోషల్ మీడియాపై అతిగా వ్యామోహం పెంచుకుంది. నిరంతరం రీల్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోలలో నిమగ్నమవడంతో పాటు, పిల్లల ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై అతిగా నియంత్రణ విధించేది. పిల్లలు టీవీ చూసినా, ఫోన్ వాడినా తట్టుకోలేకపోయేది.
ఈ క్రమంలో పిల్లలు తనకంటే తండ్రికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తన మాట వినడం లేదని నీలిమ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఇందుకోసం ఆమె చికిత్స పొందినప్పటికీ, మందులు సరిగ్గా వాడకపోవడంతో ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా తన పిల్లలు తనకు దూరమవుతున్నారనే భ్రమ (Psychological Insecurity) ఆమెను విచక్షణ కోల్పోయేలా చేసింది. ఈ నేపథ్యంలోనే పుట్టింట్లో శుభకార్యం సాకుతో శనివారం సాయంత్రం పిల్లలను తీసుకుని తుక్కాపూర్ చేరుకుంది.
ఆదివారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో నీలిమ తన కిరాతకానికి ఒడిగట్టింది. ముందస్తు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో గాఢ నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి గొంతు కోసి కిరాతకంగా చంపేసింది. అక్క పెడుతున్న కేకలు విని తమ్ముడు అక్షిత్ నిద్రలేవగా, అతడిని కూడా చంపేందుకు నీలిమ ప్రయత్నించింది. అయితే బాలుడు అప్రమత్తమై ఆమెను ప్రతిఘటించి, గాయాలతో గది బయటకు పరుగెత్తడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.
బాలుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు, పొరుగువారు వచ్చి చూడగా అప్పటికే కృతిరెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఆ గదిలోనే రత్నకళ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించగా, స్థానికులు తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: హైదరాబాద్లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మానసిక సమస్యలు ఉన్నప్పుడు సరైన సమయంలో వైద్యం అందించడంతో పాటు, బాధితుల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. కేవలం సోషల్ మీడియా వ్యామోహం, అతిగా ఆలోచించడం వల్ల ఒక చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోవడం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది.