FASTag Annual Pass Hike: వాహనాదారులకు బిగ్ అలర్ట్. నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు షాకింగ్ న్యూస్. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. పెంచిన కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో వాహనదారుడికి జేబుకు చిల్లుపడడం ఖాయం.
వాహనదారులకు NHAI షాక్
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-NHAI కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏడాదికి మూడు వేలుగా ఉన్న ఈ పాస్ ధరకు మరో రూ.75 పెంచింది. దీంతో రూ. 3075గా నిర్ణయించింది ఆ సంస్థ. పెంచి ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
నేషనల్ హైవే అథారిటీ సంస్థ 2008 ప్రకారం ప్రతీ ఏటా టోల్ చార్జీలను సవరిస్తూ ఉంటుంది. ఈసారి హోల్సేల్ ధరల సూచీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో పెంపును అమలు చేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 56 లక్షల మందికి పైగా యాన్యువల్ పాస్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఫాస్టాగ్ ఏడాది పాస్ ధర పెంపు.. వినియోగదారుల జేబుకు చిల్లు
అధిక టోల్ ఛార్జీల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడానికి గతేడాది ఆగస్టు 15న వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. సొంత వినియోగానికి ఉపయోగించే కార్లు, జీపులు, వ్యాన్ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. పాస్ తీసుకున్న డేట్ నుంచి ఏడాది పాటు లేకుంటే 200 టోల్ ప్లాజాల వద్ద ప్రయాణం చేసే వరకు చెల్లుబాటు అవుతుంది.
గడువు తీరిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవచ్చు. కస్టమర్లు రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ తరహా పాస్ను కొనుగోలు చేయవచ్చు. డబ్బులు చెల్లించిన రెండు గంటల్లో వాహనాలపై ఫాస్టాగ్ పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ పాస్ కేవలం జాతీయ రహదారులపై దాదాపు 1,150 టోల్ ప్లాజాల వద్ద పని చేయనుంది. అయితే రాష్ట్రాల పరిధిలోని టోల్ గేట్ల వద్ద మాత్రం వర్తించదు.
ALSO READ: కటక్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి
రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ వద్ద డేటా ప్రకారం, ప్రస్తుతం 56 లక్షలకు పైగా జాతీయ రహదారి వినియోగదారులు వార్షిక పాస్ను ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే జాతీయ రహదారి నెట్వర్క్లో నమోదు చేయబడిన మొత్తం లావాదేవీల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. దాదాపు 28 శాతం అన్నమాట. 2016లో ప్రారంభించినప్పటి నుండి 11.86 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీ చేయబడ్డాయి. దాదాపు 5.9 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్నాయి. నేషనల్ హైవేపై వసూలు చేసే ప్లాజాలలో ఎలక్ట్రానిక్ టోల్ లావాదేవీల కోసం ఉపయోగించబడుతున్నాయి.