Zojila Avalanche: జమ్మూకశ్మీర్లోని జోజిలా పాస్ సమీపంలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు తుఫాను విరుచుకుపడటంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాద ధాటికి సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), భారత సైన్యం , SDRF బృందాలు రంగంలోకి దిగాయి. మంచు కింద సుమారు 15 వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా సహాయక బృందాలు మంచును తొలగించి, వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి.
ఈ ప్రమాదం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారిపై భారీగా మంచు పేరుకుపోవడంతో వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడే అవకాశం ఇంకా ఉన్నందున సహాయక చర్యలు సవాలుగా మారాయి.
Also Read: ఒకవైపు శాంతి.. మరోవైపు యుద్ధం.. ఇరాన్పై ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!