Sriramanavami Celebrations in Bhadradri : శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయం లోపల, బయట విద్యుత్ దీపాలతో అలంకరించారు. నవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఆలయ పండితులు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఉగాది నుంచే.. భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అంకురార్పణ చేశారు. మూలవిరాట్ లకు అభిషేకాలు చేసి.. ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు.
Also Read : చైత్ర నవరాత్రుల చివరి రోజున ఇలా చేస్తే.. ఆ కోరికలు అన్నీ నెరవేరుతాయ్?
బుధవారం మిథిలా ప్రాంగణంలో శ్రీ సీతారాములవారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు పూర్తిచేశారు. రాములోరి కల్యాణం కన్నులపండువగా జరగనుంది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేయనున్నారు. గురువారం రాములవారి పట్టాభిషేకం జరగనుంది. కాగా.. రాములవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లోని హోటళ్లు భక్తులతో నిండిపోయాయి. మరోవైపు 59 సంవత్సరాల తర్వాత భద్రాచలం వద్ద గోదావరి రెండో వారధి ప్రారంభమైంది.
దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు పోటెత్తుతారు. ఈ క్రమంలో దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా దర్శనం కల్పించనుంది దేవస్థాన కమిటీ. ప్రత్యేక అర్చనలు, స్పెషల్ దర్శనాలను నిలిపివేసింది. నిరంతరాయ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనుంది.