Brahmamgari Kalagnanam: కలియుగం అంతం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం రాశాలో తెలుసా..? కలియుగం అంత అయ్యేది ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పేశారా..? చెబితే ఎప్పుడు అంతం అవుతుంది. ఎలా అంతం అవుతుంది. కలియుగం అంతం అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటి..? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగ అంతం గురించి చాలా స్పష్టమైన, ఆసక్తికరమైన లెక్కలు ఉన్నాయి. సాధారణంగా పురాణాల ప్రకారం కలియుగ కాలం 4 లక్షల 32 వేల ఏళ్లు అని చెబుతారు. కానీ, బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అంశాలను వివరించారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాల పరిమితి లెక్కలు: బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగంలోని మొత్తం కాలంలో ధర్మం పూర్తిగా నశించి, మహా ప్రళయం వచ్చే సమయం గురించి ఆయన కొన్ని కాలపరిమితి లెక్కలు చెప్పారు. కలియుగం మొత్తం కాలం గడిచాక కాదు, అందులో 5,000 ఏళ్లు పూర్తయినప్పటి నుంచే మార్పులు మొదలవుతాయని చెప్పారు. ఆయన లెక్కల ప్రకారం, కలియుగంలో 5వేల ఏళ్లు గడిచిన తర్వాత వీరభోగ వసంతరాయలు (కల్కి అవతారం) భూమిపైకి వస్తారని.. అప్పటి నుండి ధర్మ స్థాపన మొదలై కలియుగ అంతానికి దారితీస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారట.
అంతానికి ముందు కనిపించే సూచనలు: కలియుగం అంతమయ్యే ముందు లోకంలో వింతలు, విడ్డూరాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారట. సూర్య మండలంలో మార్పులు రావడం.. పట్టపగలే చుక్కలు కనిపించడం, అమావాస్య రోజున పౌర్ణమి వెలుగు రావడం లాంటివి జరుగుతాయట. అలాగే కృష్ణా నది పెన్నాతో కలుస్తుందని..కాశీలో గంగమ్మ తల్లి అంతర్ధానం అవుతుందని (కనబడకుండా పోతుందని) బ్రహ్మంగారు చెప్పారట. ఇంకా ఒకే కాడకు రెండు కాయలు కాయడం, వింత ఆకారాలతో జంతువులు, మనుషులు పుట్టడం లాంటి సంఘటనలు జరుగుతాయట. అలాగే బ్రహ్మం గారు సజీవ సమాధిలో ఉన్న కందిమల్లయ్యపల్లెలోని ఈశ్వరమ్మ చెట్టు చిగురుస్తుందట. ఆయన సమాధి దగ్గర ఉన్న నంది (బసవన్న) లేచి రంకె వేస్తుందట. ఇవన్నీ కలియుగ అంతానికి ప్రధాన సూచనలుగా బ్రహ్మంగారు చెప్పారట.
వినాశనం ఎలా ఉంటుంది?: కలియుగ అంతం సమయంలో వరుసగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు, తుఫానులు, భూకంపాలు సంభవిస్తాయట.. లోకమంతా చీకటి అవుతుందట. ఆ సమయంలో కేవలం పుణ్యాత్ములు, భక్తి కలిగిన వారు మాత్రమే రక్షింపబడతారని, మిగిలిన వారు నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారట.
అయితే బ్రహ్మం గారు చెప్పిన లెక్కల ప్రకారం మనం ఇప్పటికే ఆ మార్పుల దశలో (Transition period) ఉన్నామని పండితులు చెప్తుంటారు. ఇవన్నీ బ్రహ్మం గారు చెప్పడంలో ఉన్న ఉద్దేశ్యం ప్రపంచం నాశనం అయిపోవాలని కాదు కానీ మనుషులు తమ తప్పులను దిద్దుకుని, అబద్ధాలు ఆడకుండా, అన్యాయం సన్మార్గంలో నడవడానికి చెప్పారని పండితులు అంటుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.