Madurai Chithirai Festival: తమిళనాడులో చితిరై ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. తమిళులకు చితిరై ప్రధాన పండగ. చితిరై పండగను మధురైలోని మీనాక్షి ఆలయంలో ప్రారంభిస్తారు. ఏప్రిల్ 12 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 23 వ తేదీ వరకూ జరగనున్నాయి. అందులో భాగంగానే నేడు రథోత్సవాన్ని నిర్వహించారు. మీనాక్షి అమ్మన్ ఆలయ రథోత్సవాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధురై వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నెల రోజుల పాటు తమిళులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. పార్వతీ దేవి మీనాక్షి దేవి రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. చితిరై రథోత్సవం సందర్భంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రంగురంగుల రథంపై మాడ వీధుల గుండా దేవతలను ఊరేగించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు పారవశ్యంలో మునిగితేలారు. కొందరు శ్లోకాలు ఆలపిస్తూ.. ముందుకు సాగగా.. మరికొందరు సాంప్రదాయ నృత్యాలతో రథోత్సవంలో పాల్గొన్నారు. మీనాక్షి అమ్మన్ కీర్తనలు.. నామస్మరణల మధ్య, వందలాది మంది ప్రజలు రథాన్ని లాగారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు రథోత్సవానికి తరలిరావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు సైతం కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తీగునీటితో పాటు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని 80 చోట్ల తాగునీటి కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యం చితిరై పండుగ వరకే కాకుండా వేసవి కాలం ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. తాగునీరు, అన్నదానం నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం నియమించారు. పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు, వాహనాలను సిద్ధం చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యంతో పాటు.. వైద్య శిబిరాల గురించి సమాచారాన్ని ప్రదర్శించే సమాచార బోర్డులను జంక్షన్లలో ఏర్పాటు చేశారు.
Also Read: చైత్ర నవరాత్రుల చివరి రోజున ఇలా చేస్తే.. ఆ కోరికలు అన్నీ నెరవేరుతాయ్?
ముఖ్యమైన జంక్షన్లలో వైద్య శిబిరాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. ఈ ఏర్పాట్లతో పాటు వీధి దీపాలు, చెట్ల నరికివేత, రోడ్డు పునరుద్ధరణ పనులు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. ఏప్రిల్ 23న వైగై నదిలో కల్లజగర్ స్వామి ప్రవేశం కోసం నదీ తీర ప్రాంతంలో ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా.. భారీ ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేశారు.
చితిరై ఉత్సవాల్లో భక్తులకు తగిన రక్షణ, సౌకర్యాలు కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇటీవల విచారించింది. మధురైలో ఏటా జరిగే చిత్తిరై ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు కోర్టుకు వివరించారు.
#WATCH | Samayapuram, Trichy: Crowds flock to Samayapuram Sri Mariamman Temple to participate in the Chithirai car festival in Tamil Nadu. pic.twitter.com/EXhvxHpfhw
— ANI (@ANI) April 16, 2024