Kotancha Temple: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోటంచ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తెలంగాణలో రెండవ యాదాద్రిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయ పునరుద్ధరణ, భక్తులకు అవసరమైన వసతుల కల్పన కోసం ప్రభుత్వం భారీగా రూ.86.30 కోట్ల నిధులను వెచ్చించి పనులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోటంచ ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ అభివృద్ధి పనులకు అధికారికంగా ప్రారంభోత్సవం చేశారు.
ఈ అభివృద్ధి పనులలో భాగంగా రూ.12.15 కోట్ల నిధులతో కొడవటంచ ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టడం జరిగింది. అదేవిధంగా, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.74.15 కోట్ల నిధులతో నిర్మించనున్న అతిధి గృహాలు మరియు అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ నిధులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందనున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సుమారు 400 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. పూర్వం రైతులు ఈ ప్రాంతంలో పొలం దున్నుతుండగా, వారి కొడవలి (Kodavali) ఒక రాయికి తగిలి విరిగిపోయిందట. అక్కడ తవ్వగా నరసింహ స్వామి విగ్రహం బయటపడింది. అందుకే ఈ ప్రాంతానికి ‘కొడవలి వంకర్లు’, ‘కొడవలి వంచె’ అని పేరు వచ్చి, కాలక్రమేణా అది కొడవటంచ లేదా కోటంచగా మారింది.
ఈ ఆలయ పరిసరాల్లోని వీరభద్ర, మల్లికార్జున, సోమనాథ ఆలయాలు 12వ శతాబ్దపు కాకతీయ శిల్పకళా రీతులను ప్రతిబింబిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో మూడు రోజుల పాటు ఉండి, అక్కడి కోనేరు/బావి నీటిని తాగితే సంతానం కలుగుతుందని భక్తుల బలమైన నమ్మకం.
మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారు ఇక్కడ 20 నుండి 40 రోజుల పాటు బస చేసి స్వామివారిని దర్శించుకుంటే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత గడ్డితో చేసిన ఏనుగులు, గుర్రాలు, మేకల బొమ్మలను కొత్త బట్టలతో అలంకరించి, వాటిని ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్లకు కట్టి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారు.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. హోలీ (ఫాల్గుణ పౌర్ణమి) సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ మూడు పూటలా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. వాహన పూజల కోసం ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి.
ఈ ఆలయం ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి సుమారు 25 కి.మీ దూరంలో, రేగొండ మండలం నుండి 10 కి.మీ దూరంలో ఉంది. వరంగల్, హన్మకొండ నుండి రేగొండ మీదుగా బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.