RajaSaab: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కు ఇప్పుడు ‘రాజాసాబ్’ ఒక పీడకలలా మారిందా? అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, డిజిటల్ స్క్రీన్పై ప్రతి ఫ్రేమ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నెటిజన్లు.. సినిమాలో దొర్లిన లాజిక్ లేని తప్పులను ఎండగడుతున్నారు. దర్శకుడు మారుతిని టార్గెట్ చేస్తూ వస్తున్న మీమ్స్, సెటైర్లు ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ లుక్ గురించి మొదటి నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ వివాదం మరో స్థాయికి చేరింది. సినిమాలో చాలా చోట్ల ప్రభాస్ బాడీ డూప్ను వాడారని, ఆ తర్వాత ఫేస్ మార్పింగ్ సరిగ్గా చేయలేదని స్క్రీన్ షాట్స్ తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ బస్ జర్నీ చేసే సీన్లో కనిపించిన తప్పులు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బస్ ఎక్కినప్పుడు గడ్డంతో ఉన్న ప్రభాస్, బస్ దిగేసరికి ట్రిమ్ చేసిన గడ్డంతో కనిపించడం.. అసలు బస్సే మారిపోవడం వంటి సీన్ల మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “కనీసం ఎడిటింగ్లో కూడా ఇవి గమనించలేదా మారుతి?” అంటూ డైరెక్టర్ను నిలదీస్తున్నారు.
హారర్ ఫాంటసీ అని చెప్పి సినిమాలో లాజిక్కులను గాలికొదిలేశారనే కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సంజయ్ దత్ పాత్ర పారిపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం ఆయనకే వస్తుంది కదా.. మరి పారిపోవడంలో లాజిక్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మహల్, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సంజయ్ దత్ పాత్ర.. నిధి అగర్వాల్ దగ్గర రూ.3 లక్షలు దొంగిలించడం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ప్రభాస్ నానమ్మ వయసుపై వస్తున్న ప్రశ్నలు అయితే నవ్వులు పూయిస్తున్నాయి. ఒక మహారాణిగా ఆమె ఇప్పటివరకు ఎలా బతికి ఉంది? ఆమె అసలు వయసెంత? అంటూ మారుతిని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.
ALSO READ:Big TV Kissik Talks: అలాంటివాడే భర్తగా కావాలి.. శ్రీజలో ఈ కోరికలు కూడా ఉన్నాయా?
ఇక సినిమా రిలీజ్కు ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న మారుతి.. ఏకంగా తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చి సినిమా నచ్చకపోతే రమ్మని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాటే ఆయనకు శాపంగా మారింది. థియేటర్ల దగ్గర ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆర్డర్లతో ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తర్వాత ట్విట్టర్ (X) వేదికగా ట్యాగ్ చేసి మరీ విమర్శిస్తున్నారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ను పెట్టుకుని ఇంత తక్కువ క్వాలిటీతో సినిమా తీయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మరి ఈ ట్రోలింగ్పై మారుతి ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ‘రాజాసాబ్’ ఓటీటీ రిలీజ్ ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కంటే అసహనాన్నే ఎక్కువగా మిగిల్చింది.