Lord Venkateswara Wealth: తిరుమల శ్రీవారి సంపదలు ఎవరు రక్షిస్తారో తెలుసా..? వారు ఎక్కడ ఉంటారో తెలుసా..? అసలు వారిని ఏమని పిలుస్తారో తెలుసా..? చాలా మంది శ్రీవారి సంపదలు బ్యాంకుల్లో దాస్తుంటారు అనుకుంటారు. కానీ అదంతా భౌతికంగా కనిపించే సంపద. కానీ సూక్ష్మమైన సంపదలు కాపాడటానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామియే ఇద్దరికి అప్పజెప్పారని బ్రహ్మండపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగదైవం తిరుమల శ్రీవారి సంపదలు అన్ని ఇన్నీ కావు. కోట్ల విలువైన డబ్బు.. బంగారం ఆయన సొంతం అవే కాకుండా స్థిర చర ఆస్తులు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నాయని భక్తులకు తెలిసిందే. ఆ సంపదలను కాపాడటానికి వాటిని సరైన మార్గంలో ఖర్చు చేయడానికి కొండ మీద భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి.. అలాగే దేశంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను అభివృద్ది చేయడానికి. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దీప దూప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల జీర్ణోద్దరణకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పని చేస్తుంది. అలాగే స్వామి వారి పేరిట విద్యా, వైద్య ఆలయాలను నిర్వహిస్తుంది. వీటన్నింటిని కూడా స్వామికి వచ్చిన సంపదలతోనే చేస్తుంటారు. అయితే ఇదంతా భౌతికమైన సంపదల గురించి మాత్రమే కానీ స్వామి వారి సూక్ష్మ సంపదలను కాపాడటానికి శ్రీవారే స్వయంగా ఇద్దరికి అధికారం ఇచ్చారని చెప్తుంటారు ఆ ఇద్దరే శంఖనిధి, పద్మనిధి.
శంఖనిధి, పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సంపదలను, నవ నిధులను రక్షించే దేవతలు. వీరు తిరుమల ఆయల ప్రధాన గోపురం దగ్గర ఇరువైపులా కాపలాగా ఉంటారు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత పేరు శంఖనిధి, అలాగే కుడి ప్రక్కన అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి ఉంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు కలిగి ఉంటాడు.
శంఖనిధి, పద్మనిధి తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరు ప్రక్కల ద్వార పాలకులవలె సుమారు రెండు అడుగుల ఎత్తులో ఉంటారు. వీరిని పంచలోహంలో తయారు చేసి పెట్టారు. భక్తులు ఆలయంలోనికి ప్రవేశించే ముందు కాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయం గడపకు ఇరు ప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన తర్వాత ఆలయలోకి వెళ్తుండటంతో అక్కడ శంఖనిధి, పద్మనిధిలను మనం గమనించలేం.
ఈ నిధిదే వతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణం గల రాజ విగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉండవచ్చు అంటారు.
ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. కొంత మంది భక్తులు తెలిసి అక్కడ శంఖనిధి, పద్మనిధిలను చూడ్డానికి ఆగిపోతున్నారని అధికారులు అక్కడ శ్రీవారి సేవకులను అడ్డంగా నిలబెడుతున్నారు.