Diwali 2025: దీపావళి అంటేనే చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచించే దీపాల పండగ. హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఈ పండగ రోజున,.. ప్రతి ఇల్లు దీప కాంతులతో వెలిగిపోవాలి. 2025లో.. దీపావళి (లక్ష్మీ పూజ) అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి, ఇందుకు ఏ నూనె ఉపయోగించాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీపాల సంఖ్య (ఎన్ని దీపాలు వెలిగించాలి?):
దీపావళి రోజున ఖచ్చితంగా ఇన్ని దీపాలు వెలిగించాలి అనే నిబంధన లేనప్పటికీ.. సంప్రదాయం ప్రకారం, బేసి సంఖ్యలోదీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపాలు వెలిగించడం అనేది అంధకారాన్ని తొలగించి, జ్ఞానాన్ని, సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ప్రతీక.
సాధారణంగా అనుసరించే శుభప్రదమైన సంఖ్యలు:
1. 5, 7, 9, 11, 21, 51, లేదా 108 వంటి బేసి సంఖ్యల్లో దీపాలను వెలిగించవచ్చు.
2. మీ ఇష్టం మేరకు లేదా మీ ఇంటి ఆర్థిక స్థోమతను బట్టి ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు, కానీ కనీసం ఒక బేసి సంఖ్యను ఎంచుకోవడం ఉత్తమం.
3. ముఖ్యంగా.. లక్ష్మీదేవి పూజ సమయంలో కచ్చితంగా ప్రధాన దీపాలను వెలిగించాలి.
ముఖ్యమైన దీపాలు:
దీపావళి ఐదు రోజుల పండగలో కొన్ని ముఖ్యమైన దీపాలు వెలిగించడం ఆచారం.
యమ దీపం: ధన త్రయోదశి (లేదా నరక చతుర్దశి) రోజు రాత్రి దక్షిణ దిశగా యమధర్మరాజు కోసం ఒక దీపాన్ని వెలిగిస్తారు. దీనిని నువ్వుల నూనెతో వెలిగించడం శ్రేష్ఠం. ఇది అకాల మృత్యు భయాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు.
ప్రధాన ద్వారం వద్ద దీపం: ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి. దీని జ్వాల ఇంటి లోపలికి ఉండేలా చూసుకోవాలి. తద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది.
ఏ నూనెతో దీపాలు వెలిగించాలి?
దీపారాధనకు ఉపయోగించే నూనెకు పవిత్రత, విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్కో నూనె ఒక్కో దైవిక శక్తిని, ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు.
ఆవు నెయ్యి : దీపారాధనకు ఆవు నెయ్యి అత్యంత శ్రేష్ఠమైనది. ఆవు నెయ్యి సూర్యశక్తిని కలిగి ఉంటుందని.. దీనితో దీపం వెలిగిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేతి దీపం ఉత్తమం.
నువ్వుల నూనె : నువ్వుల నూనెను కూడా దీపారాధనకు శ్రేష్ఠంగా పరిగణిస్తారు. ఇది విష్ణుమూర్తికి, సకల దేవతలకు ప్రీతిపాత్రమైనది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్ఫలితాలు, గ్రహ దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. నువ్వుల నూనెను యమ దీపానికి కూడా వాడతారు.
Also Read: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?
పంచదీప నూనె: ఐదు రకాల నూనెలను (కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె) కలిపి తయారుచేసే పంచదీప నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి. అంతే కాకుండా శాంతి, సిరిసంపదలు కలుగుతాయని పండితులు సూచిస్తారు.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందని, వినాయకుడి పూజలో ఉపయోగిస్తే మంచిదని చెబుతారు.
ఏ నూనెను వాడకూడదు ?
దీపారాధనకు వేరుశనగ నూనెను, అలాగే వాసన లేని ఇతర శుద్ధి చేసిన నూనెలను ఉపయోగించకూడదని పండితులు చెబుతారు.
దీపావళి రోజున కేవలం దీపాల సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, భక్తి శ్రద్ధలతో, మనస్ఫూర్తిగా దీపారాధన చేయడం ముఖ్యం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి, ఇంటిని కాంతులతో నింపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ఇంట్లో ధన, ధాన్య సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు.