Etala Rajender: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఈటల రాజేందర్ తరఫున ప్రముఖ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు బండి కళాధర్ బుధవారం లీగల్ నోటీసులు జారీ చేశారు.
బుధవారం కమలాపూర్లోని ఈటల రాజేందర్ నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో బండి కళాధర్ మాట్లాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ప్రస్తుతం ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్న ఈటల రాజేందర్ పై కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవమానకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అంతేకాక రాజకీయాలకు సంబంధం లేని ఆయన కుటుంబ సభ్యులను కూడా దూషించడం అత్యంత బాధాకరం అని అన్నారు.
వీరిలో భోగం అజయ్ (కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు ), మాట్ల (రాజ్కుమార్ హనుమకొండ జిల్లా కమలాపూర్), జవ్వాజి కుమారస్వామి (సిరిసేడు కరీంనగర్), దాంసాని కుమార్ (ఇల్లంతకుంట), పొంగంటి సంపత్ (జమ్మికుంట), ఎడ్ల రాకేష్( ఎలుబక వీణవంక మండలం), తాళ్లపెల్లి మహేష్ గౌడ్ (వీణవంక) ఉన్నారని వివరించారు. వీరు వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా వేదికలలో ఈటల రాజేందర్, ఆయన కుటుంబాన్ని కించపరిచే పోస్టులు పెట్టారని అందువల్ల ఒక్కొక్కరిపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నామని తెలిపారు.
ALSO READ: SI JOBS: భారీగా ఎస్ఐ ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,12,400 జీతం బ్రో, ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..!
రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు స్వాగతించదగ్గవైనా వ్యక్తిగత దూషణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పారు. ఇకపై ఈటల రాజేందర్ పై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా.. కుటుంబాన్ని కించపరిచినా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కమలాపూర్లో నిర్వహించిన ప్రెస్మీట్కు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.