BigTV English

Mysore Dussehra : మైసూరు దసరా వేడుకలు.. 413 ఏళ్ల చరిత్ర..!

Mysore Dussehra : మైసూరు దసరా వేడుకలు.. 413 ఏళ్ల చరిత్ర..!
Mysore Dussehra

Mysore Dussehra : దసరా వేడుకలంటే.. ముందుగా గుర్తొచ్చేది మైసూరే. మహిషారుడిని సంహరించిన తల్లి కనుక.. ఈమెను మహిషమ్మ అనీ.. అదే మైసమ్మగా మారిందనీ, ఆ తల్లి నెలవైన ఊరు కనుకే దీనికి మైసూరు అని పేరు వచ్చిందనీ చెబుతారు.


నిజానికి ఈ వేడుకలు విజయనగర పాలకుల కాలంలో 15వ శతాబ్దంలో మొదలయ్యాయి. వారి పాలన అంతమైన తర్వాత మైసూరు పాలకులైన వడయార్ రాజులు వీటిని పునరుద్ధరించటమే గాక.. వీటికి ప్రపంచవ్యాప్తం గుర్తింపు తీసుకొచ్చారు.

వడయార్ రాజులు పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో ఈ వేడుకలను శ్రీరంగపట్నంలో నిర్వహించేవారు. అయితే.. మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో 1805 నుంచి వీటిని మైసూరులో నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మైసూరు రాజవంశీకులకు తలపాగా, పండ్లు, కానుకలు ఇచ్చి తొలి ఆహ్వాన పత్రికను ఇవ్వటంతో వేడుక పనులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే ముఖ్యమంత్రికి ఆహ్వానం అందుతుంది. ఈ తలపాగా ఇచ్చే సంప్రదాయం కారణంగా మైసూరు తలపాగాకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది.


నవరాత్రుల సందర్భంగా చాముండీ హిల్స్ ప్రాంతంలోని మైసూరు ప్యాలెస్‌లో వడయార్ రాజులు అమ్మవారి దర్బారుసేవను నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా వడయార్ రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవి 750 కిలోల బంగారు సింహాసనంపై అమ్మను కొలువుతీరుతుంది. ప్యాలెస్‌లోని సింహాసనం పెద్ద ఆకర్షణ. ఏనుగు దంతాలతో, బంగారు తోరణాలు, స్తంభాలతో కడురమ్యంగా ఉండే ఈ సింహాసనాన్ని ఒకే అంజూర చెట్టు కలపతో రూపొందించారు. దసరా ఉత్సవాలు జరిగే 10 రోజులు మాత్రమే సామాన్యులు ఈ సింహాసనాన్ని చూసే అవకాశం ఉంది.

విద్యుద్దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయే మైసూరు ప్యాలెస్ నుంచి ఈ రోజున అమ్మవారిని ఏనుగు అంబారీ ఎక్కించి, సకల రాజ లాంఛనాలతో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో లక్షలాది మంది జనంతో బాటు వేలాది విదేశీయులూ ఉత్సాహంగా పాల్గొంటారు.
నాగర హొళె అటవీ ప్రదేశంలోని ఒక గ్రామంలో ఉండే ఏనుగులను రెండు బృందాలుగా అమ్మవారి ఊరేగింపుకోసం మేళతాళాలతో తీసుకొస్తారు. బంగారు అంబారీని మోసే బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అనే ఏనుగులు ఒక బృందంగాను, మిగిలిన ఏనుగులు రెండో బృందంగా వాటి వెనక నడుస్తాయి.

ఈ ఊరేగింపు మైసూరు వీధుల గుండా సాగి, పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసే ‘బన్నిమంటపం’ వరకు సాగుతుంది. కన్నడంలో జమ్మిని ‘బన్ని’ అంటారు అందుకే ఈ మంటపాన్ని ‘బన్నిమంటపం’ అంటారు. ఏనుగులతో భారీస్థాయిలో సాగే ఈ ఊరేగింపును నాడు బ్రిటిషర్లు ‘జంబో సవారీ’అనేవారు. నేటికీ అదే పేరుతో ఈ ఊరేగింపు సాగుతోంది.

పదవ చామరాజ వడయార్ హయాంలో 1880 నుంచి నవరాత్రుల సందర్భంగా దసరా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసే ఆనవాయితీ మొదలైంది. ఈ వేడుకలను కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నేటికీ రాజకుటుంబమే నిర్వహిస్తోంది. దసరా రోజున మైసూరులోని ఆడిటోరియమ్స్ అన్నీ సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక్కడి మైదానాల్లో నవరాత్రుల వేళ జరిగే కుస్తీపోటీలు మైసూరు వేడుకలకే ప్రత్యేక ఆకర్షణ.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×