ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తాజాగా ఓ సభలో అమ్మ గురించి చెప్పిన మాటలకు ఏపీ ఐటీ మినిస్టర్ లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘అమ్మ అంటే ప్రేమైక మూర్తి.. అమ్మలాంటి వ్యక్తి మన జీవితంలో ఇక దొరకదు. మన జీవితంలో అన్నిటి కంటే పెద్దనేరం ఏంటంటే.. అమ్మకు చెప్పుకోలేని పని చేయడమే. ఏ పనైతే మనం చేస్తామో.. అది అమ్మకు చెప్పుకోవాలి. అమ్మకు చెప్పలేని పని జీవితంలో మీరెప్పుడూ చేయకూడదు. మనకు దేవుడు ఎంతో.. అమ్మ కూడా అంతే. మీరు మహాత్ముల జీవిత చరిత్ర ఎవరిది చూసినా.. అమ్మకు నమస్కారం చేయకుండా, అమ్మ గొప్పతనం చెప్పకుండా ఎవరూ లేరు. ప్రకాశం పంతులు, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ అమ్మ గొప్పతనం గురించి చాలానే చెప్పారు. ఈ జాతి మొదటి లక్షణం అమ్మను గౌరవించడం. మాతృదేవోభవ, అందరూ అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మకు నమస్కారం చేయాలి.
అలాగే.. పిల్లలు పాఠశాలకు వెళ్లేముందు తప్పనిసరిగా అమ్మకు నమస్కారం చేయాలి. ఒకవేళ మీరేదైనా తప్పు పని చేస్తే.. క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటివ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో అది అమ్మ మాత్రమే’. అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ మాటలకు మంత్రి నారా లోకేశ్ కాస్త ఎమోష్నల్ అయ్యారు. అంతేకాదు.. అమ్మ గొప్పతనం గురించి విన్న సభలోని కొందరు మహిళలు కూడా కన్నీళ్లు పెట్టుకుని, తమ తమ మాతృమూర్తులను గుర్తు చేసుకున్నారు.