Evil Eye Remedy: మనిషి ఎదుగుతున్నప్పుడు పదిమంది కళ్లు పడటం సహజం. దీనినే మనం ‘నరదృష్టి’ లేదా ‘నరఘోష’ అని అంటాం. “నరుని కంటికి నల్ల రాయి కూడా పగులుతుంది” అన్న సామెత దృష్టి దోషం తీవ్రతను తెలియజేస్తుంది. తీవ్రమైన అలసట, పనుల్లో ఆటంకాలు, అనారోగ్యం వంటివి దృష్టి దోష లక్షణాలు కావచ్చు. సకల లోకాలకు అధిపతి, పరమశివుడు లయకారుడు మాత్రమే కాదు. భక్తుల కష్టాలను హరించే భోళాశంకరుడు. శివారాధనలో కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం ద్వారా అరిష్టాల నుంచి ఈజగా బయటపడవచ్చు.
మన సంప్రదాయంలో దృష్టి దోష నివారణకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే.. లయకారుడైన శివుడిని ఆశ్రయించడం వల్ల అత్యంత వేగంగా ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. శివుడు ‘త్రయంబకుడు’ అంటే మూడు కళ్లు ఉన్నవాడు. తన మూడవ కంటితో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, దుష్ట శక్తులను దహించగల శక్తి ఆ దేవుడికి ఉంటుంది. మీపై లేదా మీ కుటుంబంపై నరదృష్టి ఉందని భావిస్తే.. శివునికి ఈ కింది వస్తువులను సమర్పించి పూజించండి.
1. విభూతి (పవిత్ర భస్మం):
శివుడికి అత్యంత ప్రీతికరమైనది విభూతి. దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్యాలు తగ్గాలంటే.. శివలింగానికి సమర్పించిన విభూతిని నుదుటన ధరించాలి. ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని భావిస్తే.. శివుని పూజించిన విభూతిని కొద్దిగా నీటిలో కలిపి ఇల్లంతా చల్లాలి. ఇది దుష్ట శక్తులను ఇంటి దరిదాపులకు రాకుండా చేస్తుంది.
2. నల్ల నువ్వులతో అభిషేకం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దోషం లేదా దృష్టి దోషం వల్ల పనులు ఆగితే.. శివలింగానికి నల్ల నువ్వులను నీటిలో కలిపి అభిషేకం చేయాలి. ఇది గడ్డు కాలం నుంచి విముక్తిని ఇస్తుంది. నల్ల నువ్వులు ప్రతికూల శక్తిని గ్రహించే గుణాన్ని కలిగి ఉంటాయి.
3. బిల్వ పత్రాలు:
“ఏక బిల్వం శివార్పణం” అంటారు. మూడు దళాలు ఉన్న బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా.. శత్రువుల నుంచి వచ్చే కుతంత్రాలు, దిష్టి ప్రభావం తగ్గుతాయి. సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివుని అర్చిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
4. రుద్రాక్ష ధారణ:
సాక్షాత్తూ శివుని కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించిన రుద్రాక్షలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఒక ముఖి లేదా ఐదు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల వ్యక్తులపై ఇతరుల అసూయ, ద్వేషం, దృష్టి దోష ప్రభావం ఉండదు. ఇది ధరించిన వారి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని ఏర్పరుస్తుంది.
5. ఆవు పాలు , తేనె:
దృష్టి దోషం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తుంటే.. శివలింగానికి ఆవు పాలు, తేనెతో అభిషేకం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ మిశ్రమం ద్వారా వచ్చే ప్రకాశం మీ జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది.
Also Read: ఇంట్లో గంగాజలం ఉందా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. దారిద్య్రం తప్పదు!
6. మహా మృత్యుంజయ మంత్ర పఠనం:
వస్తువుల సమర్పణతో పాటు ‘మహా మృత్యుంజయ మంత్రం’ పఠించడం వల్ల మృత్యు భయం, ప్రమాదాలు, తీవ్రమైన నరదృష్టి నుండి రక్షణ లభిస్తుంది. నిత్యం 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు.
శివుడు తన భక్తులపై ఎల్లప్పుడూ కరుణను చూపిస్తాడు. సంపూర్ణ విశ్వాసంతో.. స్వచ్ఛమైన మనసుతో శివుని ఆశ్రయిస్తే.. నరదృష్టి అనే చిన్న సమస్య మీ దరిదాపులకు కూడా రాదు. సోమవారాలు లేదా ప్రదోష కాలంలో పై పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.